దీదీపై సుబేందు పోటీ విషయంలో క్లారిటీ ఇచ్చిన బీజేపీ

ABN , First Publish Date - 2021-09-07T00:18:43+05:30 IST

అధిష్ఠానం ఆదేశిస్తే భవానీపూర్ నుంచి బరిలోకి దిగుతానన్న సుబేందు అధికారి ప్రకటనపై బీజేపీ రాష్ట్ర శాఖ

దీదీపై సుబేందు పోటీ విషయంలో క్లారిటీ ఇచ్చిన బీజేపీ

కోల్‌కతా : అధిష్ఠానం ఆదేశిస్తే భవానీపూర్ నుంచి బరిలోకి దిగుతానన్న సుబేందు అధికారి ప్రకటనపై బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ స్పందించారు. భవానీపూర్ నుంచి సుబేందు బరిలోకి దిగే ప్రసక్తే లేదని కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే నందిగ్రామ్‌లో దీదీని సుబేందు ఓడించారని అన్నారు. ‘‘సుబేందు అధికారి నందిగ్రామ్‌లో మమతను ఇప్పటికే ఓడించారు. భవానీపూర్ నుంచి మరో అభ్యర్థి రంగంలోకి దిగుతారు. మమతను ప్రతిసారీ ఒకరే ఎందుకు ఓడించాలి? మరో అభ్యర్థి ఆమెను భవానీపూర్‌లో ఓడిస్తారు’’ అని దిలీప్ ఘోష్ పేర్కొన్నారు. భవానీపూర్ నుంచి ఎవరిని బరిలోకి దింపాలన్న విషయంలో ఓ అంచనాకు రాలేదని, ఆలోచిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. భవానీపూర్ నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలోకి దిగుతున్నారని తృణమూల్ ప్రకటించిన నేపథ్యంలో దిలీప్ ఘోష్ ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. 

Updated Date - 2021-09-07T00:18:43+05:30 IST