స్టాండప్ కమెడియన్లకు దిగ్విజయ్ సింగ్ ఆహ్వానం

ABN , First Publish Date - 2021-12-13T21:09:20+05:30 IST

నేపధ్యంలో భోపాల్‌లో వీరిద్దరి చేత స్టాండప్ కామెడీ షో పెట్టించేందుకు దిగ్విజయ్ పూనుకున్నారు. ఇద్దరినీ ట్విట్టర్ ద్వారా ఆహ్వానించారు. అయితే కామెడీ కేవలం తనపైనే చేయాలని దిగ్విజయ్ షరతు పెట్టారు. కామెడీ షోలను అడ్డుకోవడంపై ఓ మీడియాకు కునాల్ కమ్రా ఇచ్చిన ఇంటర్వ్యూని దిగ్విజయ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ..

స్టాండప్ కమెడియన్లకు దిగ్విజయ్ సింగ్ ఆహ్వానం

భోపాల్: స్టాండప్ కమెడియన్లు కునాల్ కమ్రా, మునావర్ ఫారుఖీలకు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆహ్వానం పలికారు. భోపాల్‌లో తొందరలోనే ఒక కామెడీ షో చేయాలని దానికి సంబంధంచిన అన్ని ఏర్పాట్లను తాను చూసుకుంటానని దిగ్విజయ్ పేర్కొన్నారు. బెంగళూరులో హిందూ సంప్రదాయవాదులు మునావర్ ఫారుఖీ షోను అడ్డుకోవడం, ఆ వెంటనే కునాల్ కమ్రా కూడా బెంగళూరు నిర్వహించాల్సిన తన షోలను రద్దు చేసుకోవడం తెలిసిందే.


ఈ నేపధ్యంలో భోపాల్‌లో వీరిద్దరి చేత స్టాండప్ కామెడీ షో పెట్టించేందుకు దిగ్విజయ్ పూనుకున్నారు. ఇద్దరినీ ట్విట్టర్ ద్వారా ఆహ్వానించారు. అయితే కామెడీ కేవలం తనపైనే చేయాలని దిగ్విజయ్ షరతు పెట్టారు. కామెడీ షోలను అడ్డుకోవడంపై ఓ మీడియాకు కునాల్ కమ్రా ఇచ్చిన ఇంటర్వ్యూని దిగ్విజయ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘కునాల్ కమ్రా, మునావర్ ఫారూఖ్‌లను కామెడీ షో కోసం భోపాల్ ఆహ్వానిస్తున్నాను. దీనికి పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. కాకపోతే ఒక్క షరతు. సబ్జెక్ట్ కేవలం దిగ్విజయ్ సింగ్ మీదే ఉండాలి. సంఘీల ప్రస్తావన ఇందులో రాకూడదు. భయపడాల్సిన అవసరం లేదు. వచ్చేయండి. మీ అనుకూల సమయం ఎప్పుడో చెప్పండి. మీ అన్ని షరతులకు నేను ఒప్పుకున్నట్టే’’ అని ట్వీట్ చేశారు.


మునావర్ ఫారూఖీపై కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే కేసు పెట్టారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అతడు కామెడీ షో చేశాడని ఫిర్యాదు నమోదు కావడంతో ఇండోర్ జైలులో కొద్ది రోజులు శిక్ష అనుభవించాడు. ఇక కునాల్ కమ్రా.. మోదీ ప్రభుత్వంపై పదునైన విమర్శలతో కామెడీ షో చేస్తుంటారు. వీరిద్దరినీ వ్యూహాత్మకంగానే దిగ్విజయ్ ఎంచుకున్నారని విమర్శకులు అంటున్నారు.

Updated Date - 2021-12-13T21:09:20+05:30 IST