దిగ్విజయ్‌ని రాక్షసుడితో పోల్చిన బీజేపీ

ABN , First Publish Date - 2020-08-03T20:57:02+05:30 IST

అయోధ్య భూమిపూజపై వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై బీజేపీ..

దిగ్విజయ్‌ని  రాక్షసుడితో పోల్చిన బీజేపీ

న్యూఢిల్లీ: అయోధ్య భూమిపూజపై వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై బీజేపీ మండిపడింది. ధార్మిక కార్యక్రమాలకు అడ్డుపడే రాక్షసుల చర్యలను దిగ్విజయ్ మాటలు ప్రతిబింబిస్తున్నాయని తిప్పికొట్టింది.


'కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు గమనించండి. కమల్‌నాథ్ సుందర కాండ నిర్వహిస్తుంటే, దిగ్విజయ్ లంకా కాండ నిర్వహిస్తున్నారు. పురాతన కాలం నుంచి ధార్మిక కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా దుష్టశక్తులు వాటిని అడ్డగించే ప్రయత్నాలు చేయడం మనకు తెలుసు. అయోధ్య భూమిపూజపై తన ట్వీట్లతో దిగ్విజయ్ చేస్తున్న పని కూడా ఇదే' అని బీజేపీ నేత, మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు.


'భారతీయ సంస్కృతి, నాగరికత గురించి బాగా తెలిసిన వారే ముహూర్తం పెట్టారు.  ముహూర్తం కోసం ఏ పండితుడిని సంప్రదించారో మనకు తెలియదు. భూమిపూజ ముహూర్తానికి, నేతల ఆరోగ్యానికి ముడిపెట్టి మాట్లాడటం దురదృష్టకరం' అని మిశ్రా అన్నారు.


దీనికి ముందు, దిగ్విజయ్ ఓ ట్వీట్‌లో.. సరైన ముహూర్తం కాని సమయంలో భూమిపూజ నిర్వహిస్తున్నారని విమర్శించారు. పలువురు సీఎంలు, కేంద్ర హోం మంత్రి కోవిడ్ బారిన పడటం, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కరోనాతో మృతి చెందడం, అయోధ్య ఆలయ పూజారులకు కోవిడ్ సోకిన తరుణంలో నిర్వహిస్తున్న ఈ భూమిపూజను మోదీ వాయిదా వేయాలని కోరారు.

Updated Date - 2020-08-03T20:57:02+05:30 IST