బ్యాంకు కెనాల్ వద్ద.. నీటి మీటర్లు
ABN , First Publish Date - 2022-07-02T05:24:01+05:30 IST
పశ్చిమడెల్టాకు నీటివిడుదల సమాచారాన్ని ఇకపై డిజిటల్ మీటర్ల ద్వారా ఉన్నతాధికారులు నేరుగా పర్యవేక్షించనున్నారు.
దుగ్గిరాల, జూలై 1: పశ్చిమడెల్టాకు నీటివిడుదల సమాచారాన్ని ఇకపై డిజిటల్ మీటర్ల ద్వారా ఉన్నతాధికారులు నేరుగా పర్యవేక్షించనున్నారు. దుగ్గిరాల, రేవేంద్రపాడుల వద్ద డిజిటల్ మీటర్లను ఏర్పాటు చేశారు. విజయవాడ సీతానగరం నుంచి విడుదలయ్యే సాగునీరు పశ్చిమకాల్వద్వారా వివిధ ఛానళ్ల ఏవిధంగా పంపిణీ జరుగుతుందో నేరుగా తెలుసుకునే విధంగా డిజటల్ మీటర్లు ఏర్పాటు జరుగుతోంది. దుగ్గిరాలలో కొమ్మమూరు లాకుల వద్ద 15మీటర్లు, రేవేంద్రపాడు వద్ద 7మీటర్లు సోమవారం ఏర్పాటు చేశారు. వీటికి అవసరమైన విద్యుత్ సరఫరా కోసం ఎనిమిదిరోజుల పాటు సమాచారం అందిచేందుకు అనువుగా ఉండేలా సోలార్ ప్యానల్స్ను ఏర్పాటు చేశారు. మీటర్ల ఏర్పాటు ప్రక్రియ అనంతరం త్వరలో ప్రోగ్రామింగ్ చేసి నేరుగా నీటినిల్వ, విడుదల సమాచారం సేకరించనున్నారు. దుగ్గిరాల సబ్డివిజన్ నుంచి దాదాపు 5లక్షల ఎకరాలకు నీటివిడుదల జరుగుతుంటుంది. పశ్చిమడెల్టాకాల్వ నుంచి గరిష్టంగా ఎనిమిదివేల క్యూసెక్కుల వరకూ నీటివిడుదల జరుగుతుంటుంది. కొమ్మమూరుకాల్వ, బ్యాంక్కెనాల్, ఇతర ఛానళ్లు కలిపి మొత్తం 22 ఛానళ్ల కు దుగ్గిరాల డివిజన్ నుంచి నీటి విడుదల జరుగుతుంది. ఇదివరలో నీటి పారుదలశాఖకు చెందిన కింది స్థాయి సిబ్బంది, ఉన్నతాధికారులకు ప్రస్తుత సామర్థం, వివిధ ఛానళ్ల ద్వారా ఎన్ని క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారో ప్రత్యక్షంగా పరిశీలించి తెలియజేసేవారు. తాజాగాహైడ్రాలజీ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసిన మీటర్లలో నమోదైన సమాచారాన్ని సెన్సర్ ద్వారా తెలుసుకోనున్నారు. రేవేంద్రపాడు వద్ద ఒకసోలార్ ప్యానల్, దుగ్గిరాల మద్రాసులాకుల వద్ద రెండు సోలార్ ప్యానల్స్ను ఏర్పాటు చేశారు. సంగంజాగర్లమూడి, కొల్లిమర్ల, నల్లమడ వద్దకూడా లాకుల వద్ద డిజిటల్ మీటర్లు ఏర్పాటు చేయనున్నారు. 22 డిజిటల్ మీటర్లకు రోటర్, వైఫై సహాయంతో నేరుగా సమాచారం అందించే విధంగా సెన్సార్లను కూడా ఏర్పాటు చేసినట్లు నీటిపారుదలశాఖ డీఈ ఎం. అనిల్కుమార్ తెలిపారు.