గుప్త నిధుల కోసం తవ్వకాలు

ABN , First Publish Date - 2022-08-16T06:37:54+05:30 IST

ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలోని ఒక ఇంట్లో గుప్త నిధుల కోసం రహస్యంగా జరుగుతున్న తవ్వ కాలను నూజివీడు రూరల్‌ పోలీసులు భగ్నం చేశారు.

గుప్త నిధుల కోసం తవ్వకాలు
15 అడుగుల లోతు భారీ గొయ్యి

ఐదుగురి అరెస్టు


నూజివీడు టౌన్‌, ఆగస్టు 15: ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలోని ఒక ఇంట్లో గుప్త నిధుల కోసం రహస్యంగా జరుగుతున్న తవ్వ కాలను నూజివీడు రూరల్‌ పోలీసులు భగ్నం చేశారు. గొల్లపల్లికి చెందిన వేదాంతం శ్రీనివాసరావు ఇంట్లో కొద్ది రోజులుగా విశాఖకు చెందిన కొందరు వ్యక్తులు శ్రీనివాసరావుతో కలసి రాత్రిపూట అనుమానాస్పదంగా వ్యవహరించడంతో పరిసర ప్రాంత ప్రజలు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి  శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళి  పోలీసులు పరిశీలించగా, ఇంట్లో దాదాపు 15 అడుగుల లోతు భారీ గొయ్యి తీసి  ఉండటం, దీనిపై  ఇంటి వద్ద వున్న వ్యక్తులు పొంతనలేని సమాధానాలు చెప్తుండటంతో నూజివీడు రూరల్‌ ఎస్‌ఐ లక్ష్మణ్‌ నిందితుడు శ్రీనివాసరావుతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుడు శ్రీనివాసరావుకు అతని ఇంట్లో కొంతకాలంగా గజ్జెల చప్పుళ్ళు వినబడుతున్నట్టు పరిచయస్తులకు చెప్పాడని, ఇంట్లో గుప్త నిధులు వుండటం వల్లే అలా జరుగుతోందని వారు చెప్పడంతో విశాఖకు చెందిన వ్యక్తులతో గుప్తనిధుల కోసం వేట సాగించినట్లు విశ్వసనీయ సమాచారం.




Updated Date - 2022-08-16T06:37:54+05:30 IST