పంజాబ్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదు: కెప్టెన్
ABN , First Publish Date - 2022-02-14T21:42:28+05:30 IST
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ ఉన్నందున ఈసారి ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన..
ఛండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ ఉన్నందున ఈసారి ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చని పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) సుప్రీం కెప్టెన్ అమరీందర్ సింగ్ జోస్యం చెప్పారు. పీఎల్సీ-బీజేపీ-సాద్ (సంయుక్త్) కూటమి దూసుకు వెళ్లనుందని చెప్పారు. పంజాబ్లో ప్రస్తుతం చతుర్ముఖ లేదా పంచముఖ పోటీ ఉందని, ఇండిపెండెంట్లు కూడా బరిలో ఉన్నారని అన్నారు.
''బహుముఖ పోటీ వల్ల ప్రజలు సులువుగా తమకు నచ్చిన పార్టీకి ఓటు వేస్తారు. కానీ, పార్టీల పరంగా చూసినప్పుడు వాటి పనితీరు బాగా మెరుగ్గా ఉంటే తప్ప పోటీ చాలా క్లిష్టంగా ఉంటుంది. వారిలో చాలా మందికి 10 నుంచి 15 సీట్లు దాటే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు. ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని నేను అనుకోవడం లేదు. ప్రజలు ఆప్ గురించి మాట్లాడుతున్నారు. అయితే, ఆ పార్టీకి ఆదరణ రోజురోజుకూ పడిపోతోంది. కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే. భగవంతుని దయవల్ల మేము మాత్రం ముందుకు దూసుకు వెళ్తున్నాం'' అని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెప్టెన్ అమరీందర్ సింగ్ చెప్పారు.