డీజల్, పెట్రోల్ కొరత
ABN , First Publish Date - 2022-05-21T05:37:48+05:30 IST
జిల్లాలో పెట్రోలు, డీజల్ కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ నుంచి కంట్రోలింగ్ పేరుతో అవసరమైన బంకులకే సరఫరా చేస్తున్నారు.
నోస్టాక్ ఉన్న బంకులకే సరఫరా
స్టాక్ ఉంటే పంపడం లేదు.. జిల్లాలో ఇదీ పరిస్థితి
ఒంగోలు(కలెక్టరేట్), మే 20 : జిల్లాలో పెట్రోలు, డీజల్ కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ నుంచి కంట్రోలింగ్ పేరుతో అవసరమైన బంకులకే సరఫరా చేస్తున్నారు. జిల్లాలో రోజుకు ఆ కార్పొరేషన్ నుంచి 2వేల కిలోలీటర్ల పెట్రోలు, 5,100 కిలో లీటర్ల డీజిల్ను సరఫరా చేస్తుంటారు. సాధారణంగా ఆయా పెట్రోలు బంకులకు రోజువారీ సరఫరా ఉంటుంది. ఎప్పుడూ స్టాక్ ఉంటుంది. అయితే గురువారం నుంచి బంకులకు సరఫరాను కంట్రోల్ చేస్తున్నట్లు తెలిసింది. ఆయా బంకుల్లో పూర్తిస్థాయిలో స్టాక్ లేకపోతేనే పంపుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిస్థితి నెలకొని ఉన్నట్లు సమాచారం. అందిన సమాచారం మేరకు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగిపోవడంతో పెట్రోల్పై రూ.10, డీజిల్పై రూ.25 మేర నష్టం వస్తుండటంతో తగిన విధంగా సరఫరా చేయడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం బంకుల్లో డీజిల్, పెట్రోలు కొరత లేకపోయినా గతంలో మాదిరిగా నిల్వలు లేవని తెలుస్తోంది.