రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ నరసింహం గుంటూరు వాసే
ABN , First Publish Date - 2021-04-21T05:28:17+05:30 IST
రిజర్వ్బాంక్ మాజీ గవర్నర్ మైదవోలు నరసింహం(94) హైదరాబాద్లో కరోనాకు చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు.
ఇంటిపేరు... జన్మస్థలం మైదవోలు
గుంటూరు, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): రిజర్వ్బాంక్ మాజీ గవర్నర్ మైదవోలు నరసింహం(94) హైదరాబాద్లో కరోనాకు చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు. బ్యాంకింగ్ రంగంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఆయన స్వస్థలం యడ్లపాడు మండలం, మైదవోలు గ్రామం. 1927 జూన్ 3న ఆయన జన్మించారు. అతని తండ్రి పేరు శేష చలపతి. 1935లో అతని తల్లిదండ్రులు ఆ గ్రామాన్ని విడిచి వెళ్లిపోయారు. నరసింహం మద్రాస్ ప్రెసిడెన్సి కళాశాలలోను, ఆ తరువాత ఉన్నత విద్యను కెంబ్రిడ్జ్లోని సెన్ట్ జాన్స్ కాలేజీలో పూర్తిచేశారు. 1983లో భారత ప్రభుత్వ ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేశారు. అంతకుమునుపు 1977లో 13వ రిజర్వ్బాంక్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టి కొన్ని నెలలపాటు ఆ పదవిలో కొనసాగారు. శాంతి సుందరేశన్ను ఆయన వివాహమాడారు. 2000లో ఆయన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఆయన మరణంపై మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ యలమంచలి శివాజీ సంతాపం తెలియజేశారు.