గోవెన గోడెవరికీ పట్టదా?

ABN , First Publish Date - 2022-05-09T04:29:48+05:30 IST

ప్రపంచమంతా కంప్యూటర్‌ యుగం వైపు పరుగులు తీస్తున్నా ఇంకా కొన్ని గ్రామాలు కనీసం రోడ్డు, కరెంటు, మంచినీరు లేక కొట్టుమిట్టాడుతున్నాయి.

గోవెన గోడెవరికీ పట్టదా?

- కంప్యూటర్‌ యుగంలోనూ కాలినడకే శరణ్యం

- కరెంటు లేదు, రోడ్డు లేదు

- చెలిమెల నీటితోనే గొంతు తడపడుకుంటున్న దైన్యం

తిర్యాణి, మే 8: ప్రపంచమంతా కంప్యూటర్‌ యుగం వైపు పరుగులు తీస్తున్నా ఇంకా కొన్ని గ్రామాలు కనీసం రోడ్డు, కరెంటు, మంచినీరు లేక కొట్టుమిట్టాడుతున్నాయి. జిల్లాలోని తిర్యాణి మండలం గోవెన గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. ఈ పంచాయతీ పరిధిలో అయిదగూడెలు ఉన్నాయి. వాటన్నింటినీ కలిపి గోవెనగా పిలుస్తారు. 361 మంది జనాభా ఉన్నారు. దశాబ్దాలుగా ఈ గూడాలకు ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు. కరెంటు లేదు. నాయకపుగూడ, కుర్సిగూడ గ్రామాలైతే అత్యంత వెనకబడి ఉన్నాయి. ఐదేళ్ల క్రితం ఐటీడీఏ ఆధ్వర్యంలో సోలార్‌ విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేసినా నిర్వహణ లేక చెడి పోయాయి. పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నాలుగు సోలార్‌ లైట్లు మాత్రమే ప్రస్తుతం వీరికి వెలుగునిస్తున్నాయి. ఈ గూడాలకు తాగునీటి సౌకర్యం లేదు. కనీసం ఒక్క చేతి పంపు కూడా వేయలేదు. మిషన్‌ భగీరథ ట్యాంకులు అలంకార ప్రాయంగా మిగిలాయి. నాయకపుగూడ వాసులు సమీపంలోని వాగులో చెలిమ తవ్వి నీళ్లు తెచ్చు కుంటున్నారు. వానాకాలంలో వాగులో ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు చెలిమ నీరు కూడా దొరకదని ఆదివాసులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. మిగితా నాలుగు గూడాల వారు కిలో మీటర్ల దూరం వెళ్లి వ్యవసాయ బావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. 

కాలినకడనే ప్రయాణం

గోవెన పంచాయతీ పరిధిలోని అయిదు గూడాల ప్రజలు ఏ అవసరం ఉన్నా కిలో మీటర్ల కొద్ది నడిచి వెళ్లాల్సిందే. ప్రతినెల రేషన్‌, పెన్షన్‌, ఆస్పత్రి సామగ్రి కోసం దట్టమైన అటవీ ప్రాంతంలో రెండు వాగులను దాటుకుంటూ అయిదు కిలోమీటర్లు నడిచి లింగాపూర్‌ మండలం రాఘా పూర్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి వాహనాల ద్వారా తిర్యాణి వెళ్లాల్సి ఉంటుంది. గతంలో పోలీసులు బల్హాన్‌పూర్‌ మీదుగా గోవెనకు మట్టి రోడ్డు నిర్మించినా వరదలతో నామ రూపాల్లేకుండా పొయింది. అత్యవసర సమయంలో ఆస్పత్రికి వెళ్లడానికి 108వాహనం రాలేని పరిస్థితి. పంచా యతీ పరిధిలో అంగన్‌వాడీకేంద్రం లేదు. చిన్నారులు, గర్భిణులు, బాలిం తలకు పౌష్టికాహారం అందడం లేదు. నాయకపుగూడలో తలపెట్టిన పాఠశాల భవనం నేటికీ అసంపూర్తిగానే ఉంది. ఇక్కడి పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. 

మా గోస ఎవరికీ రావద్దు

- రాజమ్మ, నాయకపుగూడ

మాకు సర్కారు నుంచి రేషన్‌ బియ్యం తప్ప ఎలాంటి లబ్ధి లేదు. తాగడానికి నీళ్లు, కరెంటు, రోడ్డు లేవు. ఎవరూ పట్టించుకోవడం లేదు. చెలిమె నీళ్లే తాగుతున్నాం. ఆపదవస్తే కిలో మీటర్ల దూరం నడిచి ఆస్పత్రులకు పోతున్నాం. కరెంటు కోసం అధికారులను అడిగితే అటవీ అనుమతులు రావట్లేదని చెప్తున్నారు. 

బోర్లు వేయాలి

- కొడప లచ్చుబాయి, గోండుగూడ

మా గ్రామంలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఎంతో దూరం నడిచి వాగు చెలిమల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నాం. గ్రామంలో తాగునీటి కోసం చేతి పంపు వేయాలి. అలాగే గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం లేదు. పిల్లలకు పౌష్టిక ఆహారం కోసం అయిదు కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోంది.

Read more