దిబ్బిడి హైస్కూల్‌లో విద్యాకానుక కిట్లు దహనం

ABN , First Publish Date - 2022-08-17T06:22:37+05:30 IST

మండలంలోని దిబ్బిడి గ్రామ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యాకానుక కింద ప్రభుత్వం సరఫరా చేసిన 200 జతల బూట్లను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు.

దిబ్బిడి హైస్కూల్‌లో విద్యాకానుక కిట్లు దహనం
దిబ్బిడి హైస్కూల్‌లో కాలిపోయిన బూట్లు

200 జతల బూట్లు కాల్చివేసిన ఆగంతకులు

పోలీసులకు ఫిర్యాదు చేసిన హెచ్‌ఎం

పరిశీలించిన డీఈవో, ఎంఈవో


బుచ్చెయ్యపేట, ఆగస్టు 16: మండలంలోని దిబ్బిడి గ్రామ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యాకానుక కింద ప్రభుత్వం సరఫరా చేసిన 200 జతల బూట్లను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. సమాచారం అందుకున్న  జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి, ఎంఈవో దేముడమ్మ పాఠశాలకు చేరుకుని పరిశీలించారు.

దిబ్బిడి హైస్కూల్‌ క్లస్టర్‌ పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసేందుకు సరఫరా అయిన బూట్లను దిబ్బిడి హైస్కూల్‌లోని ఒక గదిలో భద్రపరిచారు. మంగళవారం ఉదయం ఈ గది నుంచి పొగ రావడాన్ని గమనించిన స్థానికులు పాఠశాలకు చేరుకున్నారు. గది తలుపులు తెరచి మంటలు ఆర్పారు. అప్పటికే  200 జతల బూట్లు కాలిపోయాయి. ఈ ఘటనపై ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.కాశి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ కుమారస్వామితోపాటు క్లూస్‌ టీమ్‌ బృందం హైస్కూల్‌కు వచ్చి దర్యాప్తు చేపట్టారు. జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి, ఎంఈవో దేముడమ్మ మంగళవారం మధ్యాహ్నం పాఠశాలకు చేరుకుని హెచ్‌ఎం, ఉపాధ్యాయులతో మాట్లాడారు. కాలిపోయిన బూట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా  ప్రధానోపాధ్యాయుడు బి.కాశి మాట్లాడుతూ, దిబ్బిడి హైస్కూల్‌ క్లస్టర్‌ పరిధిలోని పాఠశాలల విద్యార్థుల కోసం 750 జతల బూట్లు రాగా, వాటిని ఒక గదిలో భద్రపరిచామని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు వీటికి నిప్పు పెట్టారని, 200 జతల బూట్లు కాలిపోయాయని వివరించారు. వీటి విలువ సుమారు రూ.40 వేలు వుంటుందన్నారు. డీఈవో లింగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు.


Updated Date - 2022-08-17T06:22:37+05:30 IST