టర్నోవర్ పెంచే పేరిట భారీ కుంభకోణం: ధూళిపాళ్ళ నరేంద్ర

ABN , First Publish Date - 2022-03-17T19:28:58+05:30 IST

గుంటూరు: డీసీసీబీలకు గతానికి భిన్నంగా నామినేషన్ విధానంలో ఛైర్మన్లను నియమించారని...

టర్నోవర్ పెంచే పేరిట భారీ కుంభకోణం: ధూళిపాళ్ళ నరేంద్ర

గుంటూరు: డీసీసీబీలకు గతానికి భిన్నంగా నామినేషన్ విధానంలో ఛైర్మన్లను నియమించారని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ ఆరోపించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేవలం రెండేళ్లలో రూ. 2వేల కోట్లు టర్నోవర్ పెంచామని ఘనంగా చెప్పారని, టర్నోవర్ పెంచే పేరిట భారీ కుంభకోణానికి పాల్పడ్డారని అన్నారు. సొసైటీలలో రూ. 500 కోట్లు కుంభకోణం జరిగిందన్నారు. ఇంకా బయట పడాల్సినవి చాలా ఉన్నాయన్నారు.


ఒకే గ్రూపుకు పేర్లు మార్చి రుణాలు తీసుకుని అధికార పార్టీ నేతలు పంచుకున్నారని ధూళిపాళ్ళ ఆరోపించారు. నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాల్లో ఈ తరహా అక్రమాలు జరిగాయన్నారు. డ్వాక్రా రుణాలు కేవలం రెండేళ్లలో 21 కోట్ల నుంచి 600 కోట్లకు చేరడం సాధ్యమా? అని ప్రశ్నించారు. హోంమంత్రి సొంత నియోజకవర్గంలో రుణాల కుంభకోణం జరిగిందన్నారు. దీనిపై హోంమంత్రి ఇప్పటి వరకు నోరు విప్పలేదని విమర్శించారు. జిల్లా బ్యాంక్ ఛైర్మన్ రాము తెలివిగా వ్యవసాయ మంత్రిని కలిశారని, రుణాల కుంభకోణంపై  పోలీసు విచారణ జరిపించాలన్నారు. బ్యాంక్ చైర్మన్ విజిలెన్స్ విచారణ కోరడం తప్పించుకోవడానికేనని, జిల్లాలో ఎన్నడూ లేని విధంగా సహాకార బ్యాంక్‌లను వైసీపీ నేతలు దోచుకున్నారని ధూళిపాళ్ళ నరేంద్ర అన్నారు.

Updated Date - 2022-03-17T19:28:58+05:30 IST