నిషేధం ముంగిట ధోనీ.. తప్పించుకోవాలంటే అదొక్కటే మార్గం
ABN , First Publish Date - 2021-04-16T23:44:57+05:30 IST
ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా వాంఖడే మైదానంలో పంజాబ్ కింగ్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్పై ఇరు జట్ల అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే చెన్నై అభిమానుల్లో..
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా వాంఖడే మైదానంలో పంజాబ్ కింగ్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్పై ఇరు జట్ల అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే చెన్నై అభిమానుల్లో కొంత ఆందోళన కూడా నెలకొంది. దానికి కారణం.. ధోనీ నిషేధం ముంగిట ఉండడమే. తొలి మ్యాచ్లో ఢిల్లీపై స్లో ఓవర్ రేట్ నమోదు చేసిన ధోనీ.. బీసీసీఐ నుంచి రూ.12 లక్షల జరిమానా ఎదుర్కొన్నాడు. ఇక ఇప్పుడు ఈ మ్యాచ్లో కూడా ధోనీ స్లో ఓవర్ రేట్ను నమోదు చేస్తే నిషేధం ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ నిర్ణయం మ్యాచ్ రిఫరీ చేతుల్లో ఉంటుంది.
ఇప్పటికే ధోనీ ఒకసారి ఈ తప్పు చేయడంతో బీసీసీఐ కోడ్ ఆఫ్ కండక్ట్ను అనుసరించి అతడిపై మ్యాచ్ రిఫరీ ఓ మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే గతేడాది టోర్నీలో దారుణ ప్రదర్శనతో ఇంటిముఖం పట్టడం, ఈ ఏడాది కూడా ఓటమితో టోర్నీ ఆరంభించడం వంటి ఒడిదుడుకులు ఎదుర్కొటున్న చెన్నైకి ధోనీపై నిషేధం భారీ దెబ్బగా మారుతుంది. అయితే దీని నుంచి తప్పించుకోవాలంటే ఎట్టిపరిస్థితుల్లో నిర్ణీత సమయంలోపు 20 ఓవర్లు వేసేలా ధోనీ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
కాగా.. తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 221 పరుగుల రికార్డ్ స్కోర్ చేసిన పంజాబ్ కింగ్స్తో ఈ మ్యాచ్లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్లో ఎదుర్కోబోతోంది. అంతేకాకుండా బ్యాటింగ్కు అనుకూలమైన ముంబై పిచ్పై ఈ మ్యాచ్ కూడా జరగనుండడంతో ఈ సారి కూడా మైదానంలో పరుగుల వరద పారే అవకాశం కనిపిస్తోంది.