నిందితులను అరెస్టు చేయాలని ధర్నా

ABN , First Publish Date - 2021-10-20T05:56:18+05:30 IST

తమ కొడుకుని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని, న్యాయం జరిగేవరకు ఇక్కడి నుంచి కదిలేది అంటూ మృతుడి కుటుంబీకులు బం ధువులతో కలిసి నిందితుడి ఇంటి ముందు ధర్నా నిర్వహించిన సంఘటన గొల్లపల్లి మండలంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తంగా మారింది.

నిందితులను అరెస్టు చేయాలని ధర్నా
ఆందోళనకారులతో మాట్లాడుతున్న డీఎస్పీ ప్రకాశ్‌

డీఎస్పీ ప్రకాశ్‌ జోక్యంతో ఆందోళన విరమించిన మృతుడి బంధువులు

గొల్లపల్లి, ఆక్టోబరు 19 : తమ కొడుకుని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని,  న్యాయం జరిగేవరకు ఇక్కడి నుంచి కదిలేది అంటూ మృతుడి కుటుంబీకులు బం ధువులతో కలిసి నిందితుడి ఇంటి ముందు ధర్నా నిర్వహించిన సంఘటన గొల్లపల్లి మండలంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. డీఎస్పీ ప్రకాశ్‌ సంఘటనాస్థలి ని చేరుకుని మృతుడి బంధువులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంలో ఆందోళనను విరమించారు. మండలంలోని అగ్గిమల్ల గ్రామంలో సోమవా రం  తడవేణి వెంకటేష్‌ (25) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసారు. సంఘటన జరిగిన అనంతరం మృతుడి బంధువులు తమ కొడుకును కొలగాని రాజేంధర్‌తో మరి కొంతమంది హత్య చేశారంటూ ఆరోపిస్తూ నిందితుడి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. వెంటనే నిందితులను అరెస్ట్‌ చేసి న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేశారు. మృతదేహాన్ని నిందితుడి ఇంటి ముందు పాతిపెడ తామంటూ గొయ్యి తవ్వి ఆందోళనకు దిగారు. వివాహేతర సంబంధం అంటగంటి అన్యాయంగా బలితీసుకున్నారని మృతుడి తల్లిదండ్రులు అక్కడే భీష్మించారు. సుమారు గంటపాటు నిందితుడి ఇంటి ముందు ఆందోళన నిర్వహించడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్‌ సంఘటనాస్థలికి తరలివచ్చి మృతుడి బంధువులతో మాట్లాడారు. హత్యకు కారకులైన వారిని త్వరితగతిన పట్టుకుని అరెస్ట్‌ చేస్తామని,  బాధితులకు సత్వర న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. అనంతరం మృతదేహానికి దహనసంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి, మల్యాల సీఐలు కోటేశ్వర్‌, రమణామూర్తి, ఎస్సై గండ్ర మనోహర్‌ రావు, పోలీసు సిబ్బంది, మృతుడి బంధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T05:56:18+05:30 IST