ధర్నా విరమించి పనులకు సహకరించాలి
ABN , First Publish Date - 2022-05-25T06:33:29+05:30 IST
వారం రోజుల్లో పరిహారం అందజేస్తామని, ధర్నా విరమించి రిజర్వాయర్ పనులకు సహకరించాలని తహసీల్దార్ సంఘ మిత్ర చర్లగూడెం భూనిర్వాసితులను కోరారు. పరిహారం, పునరావాసం, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని చర్లగూడెం ముంపు గ్రామ బాధిత భూ నిర్వాసితులు రిజర్వాయర్ క్యాంపు కార్యాల
వారం రోజుల్లో పరిహారం అందజేస్తామన్న అధికారులు
పరిహారం చెల్లిస్తేనే ధర్నా విరమిస్తామన్న నిర్వాసితులు
వెనుదిరిగిన అధికారులు.. కొనసాగుతున్న ధర్నా
మర్రిగూడ, మే 24: వారం రోజుల్లో పరిహారం అందజేస్తామని, ధర్నా విరమించి రిజర్వాయర్ పనులకు సహకరించాలని తహసీల్దార్ సంఘ మిత్ర చర్లగూడెం భూనిర్వాసితులను కోరారు. పరిహారం, పునరావాసం, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని చర్లగూడెం ముంపు గ్రామ బాధిత భూ నిర్వాసితులు రిజర్వాయర్ క్యాంపు కార్యాలయం వద్ద చేస్తున్న ధర్నా మంగళవారం 15వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా తహసీల్దార్ బాధి తులతో మాట్లాడారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చర్లగూడెం రిజర్వాయర్లో ముంపునకు గురైన చర్లగూడెం భూ నిర్వాసితులు అధైర్యపడొద్దన్నారు. ప్రభుత్వం పునరావాసం, ఆర్అండ్ఆర్ ప్రత్యేక ప్యాకేజీ కల్పించడంతోపాటు డిండి ఇరిగేషన్ పథకం కింద ఇళ్లు కోల్పోయిన బాధితులకు పరిహారం ఇస్తుందన్నారు. కలెక్టర్ ఆదేశాలమేరకు వారం రోజులలోపు పరిహారం అందిస్తామని, ధర్నా విరమించాలని కోరారు. ఈ నెలలోపు పరిహారం చెల్లిస్తామని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో చెప్పి ఐదు రోజులు అవుతున్నా ఇప్పటివరకు పరిహారం అందించలేదని నిర్వాసితులు చెప్పారు. న్యాయం జరిగేంతవరకు ధర్నా విరమించేదిలేదని అధికారులకు తేల్చిచెప్పారు. ఇంటింటి సర్వేలో భాగంగా అధికారులు భూ నిర్వాసితులకు నచ్చజెప్పినా వారు వినకపోవడంతో తహసీల్దార్ వెనుదిరిగి వెళ్లారు. 15రోజుల నుంచి క్యాంపు కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నారు. రాత్రివేళలో చర్లగూడెం భూ నిర్వాసితులు వంటవార్పు చేస్తూ బసచేస్తున్నారు. తహసీల్దార్ వెంట మర్రిగూడ ఎస్ఐ గుత్తా వెంకట్రెడ్డి ఉన్నారు.