ప్రేమించి మోసం చేశాడని ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-04-17T06:04:10+05:30 IST
ప్రేమించి మోసం చేశాడని ఫిర్యాదు
పోలీస్ స్టేషన్ ఎదుట యువతి బైఠాయింపు
యువకుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు..అరెస్టు
విస్సన్నపేట, ఏప్రిల్ 16: ప్రేమించి, పెళ్లాడుతానని తనను ఓ యువకుడు మోసగించాడంటూ మండలం లోని ఓ గ్రామానికి చెందిన యువతి గురువారం రాత్రి పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపింది. మానవ హక్కుల కౌన్సిల్ ప్రతినిధులు ఉన్నం జ్ఞానసుందరితో పాటు పలువురు మహిళా సంఘాల నాయకులు యువతికి మద్దతు తెలిపారు. ఎస్సై లక్ష్మణ్ వారితో చర్చించి నిరసనను విరమింపజేశారు. సమాచారం అందుకున్న తిరువూరు సీఐ ఎం.శేఖర్బాబు విస్సన్నపేటకు చేరుకుని యువతి, యువకుడి కుటుంబ సభ్యులతో చర్చించారు. చర్చలు విఫలం కావడంతో యువతిని మోసం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ గ్రామానికి చెందిన కె.నరసింహారావుకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. యువకుడు పెళ్లి నిరాకరించడంతో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు తదితర కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. శుక్రవారం నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు యువతి గ్రామంలో పర్యటించి కేసు విచారించారు. సాక్షుల నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు.