ఎడగారులో రికార్డు స్థాయి ధాన్యం సేకరణ
ABN , First Publish Date - 2020-12-06T04:30:36+05:30 IST
జిల్లాలో ఎడగారు ధాన్యం సేకరణ రికార్డు స్థాయిలో జరిగింది.
రైతులకు రూ.559.47 కోట్ల చెల్లింపు
నెల్లూరు(హరనాథపురం), డిసెంబరు 5 : జిల్లాలో ఎడగారు ధాన్యం సేకరణ రికార్డు స్థాయిలో జరిగింది. 92 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 3 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ లక్ష్యాన్ని మించి 3,08,125 మెట్రిక్ టన్నులను సేకరించారు. ఈ సారి ధాన్యం సేకరణలో కలెక్టర్ చక్రధర్బాబు, జేసీ డాక్టర్ హరేందిరప్రసాద్లు ముందస్తు సమావేశాలు నిర్వహించారు. జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ముందస్తు అంచనా వేశారు. ఆ ప్రకారం దిగుబడికి తగినట్లు ధాన్యం సేకరణకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా పరిస్థితులు ఉన్నా జిల్లాలో రైతుల నుంచి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ జరిగింది.
రూ.559కోట్ల చెల్లింపులు
3.98 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 13829 మంది రైతుల నుంచి పలు దఫాలుగా సేకరించారు. ఇందుకు గాను రైతులకు రూ.559.47కోట్లు చెల్లించారు. ఇంకా 240 మంది రైతులకు రూ.4.99 కోట్లు చెల్లించాల్సి ఉంది. సేకరించిన ధాన్యానికి మిల్లర్ల నుంచి 1.42 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రావాల్సి ఉండగా, 1.40 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ను త్వరగా రాబట్టారు.
నాలుగు రోజుల్లో చెల్లింపులు
జిల్లాలో ఎడగారు సీజన్లో 3 లక్షల మెట్రిక్టన్నుల ధాన్యాన్ని సేకరించటం లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. 3.08లక్షల టన్నులను 13,829 మంది రైతుల నుంచి సేకరించాం ఇందుకుగాను రూ.559.47కోట్లు చెల్లించాం. ఇంకా 240 మంది రైతులకు రూ. 4.99కోట్లు చెల్లించాల్సి ఉంది. నాలుగు రోజుల్లో మిగిలిన చెల్లింపులు పూర్తి చేస్తాం.
- రోజ్మాండ్, డీఎం, సివిల్ సప్లయీస్