రోడ్లపైనే ధాన్యం ఆరబోత

ABN , First Publish Date - 2020-11-26T05:24:55+05:30 IST

రోడ్లపైనే ధాన్యం ఆరబోత

రోడ్లపైనే ధాన్యం ఆరబోత
బొంగ్లూరు నుంచి పెద్ద అంబర్‌పేట్‌ వెళ్లే దారిలో ఔటర్‌ సర్వీస్‌ రోడ్డుపై ఆరబోసిన ధాన్యం

  • కల్లాల ఏర్పాటుకు స్థలాలు కరువు
  • ఔటర్‌ సర్వీస్‌ రోడ్లపై ధాన్యం కుప్పలు
  • ప్రమాదాల బారిన వాహనదారులు
  • పట్టించుకోని అధికారులు

ఆదిభట్ల : ఔటర్‌ సర్వీస్‌ రోడ్లపై రైతులు ధాన్యం కుప్పలు ఆర బోస్తుండటంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. సర్వీస్‌ రోడ్లపై వరి ధాన్యం కుప్పలు ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతున్నాయి.  రైతులు  ఇష్టానుసారం సర్వీస్‌ రోడ్డుపై ధాన్యం కుప్పలు రోజుల తరబడి ఆరబోస్తుండటంతో ప్రమాదాలకు మరింత ఊతమిస్తోందని వాహనాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధి వండర్‌లా పార్కు ఎగ్జిట్‌ పదమూడు నుంచి కొంగర కలాన్‌, బొంగ్లూరు, ఇటు రాందా్‌సపల్లి శివారు వరకు సుమారు పదిహేను కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్న ఔటర్‌ సర్వీస్‌ రోడ్డులో అడుగడుగునా ధాన్యం ఆరబెడుతున్నారు. రోజంతా ఆరబోసిన ధాన్యం సాయంత్రం కాగానే ఎక్కడిక్కడే కుప్పలుగా చేసి మరుసటి రోజు ఉదయాన్నే మళ్లీ ఆరోబోస్తున్నారు. రాత్రంతా ధాన్యం కుప్పలు అక్కడే ఉంచడంతో చీకట్లో కుప్పలు కనిపించక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.


కల్లాలకు స్థలం కరువు..


ఔటర్‌కు సమీపంలోని ఇబ్రహీంపట్నం మండలం రాందాస్‌పల్లి, మంగల్‌పల్లి, కొంగరకలాన్‌, బొంగ్లూరు, ఆదిభట్ల గ్రామాలు అలాగే మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామాల్లో రైతులు ధాన్యాం పండిస్తున్నారు. ఈ ప్రాంతంలో భూముల ధరలు ఎక్కువగా ఉండటంతో పంట ఆరబెట్టేందుకు స్థలం దొరకడం కష్టంగా మారుతోంది. దీంతో  ధాన్యం ఆరబెట్టడానికి కల్లాలు కరువై రైతులు ఔటర్‌ సర్వీస్‌ రోడ్డును ఎంచుకుంటున్నారు.

Updated Date - 2020-11-26T05:24:55+05:30 IST