ఆరేళ్లలో ఒక్క ఘర్షణ జరగలేదు

ABN , First Publish Date - 2020-08-15T10:06:11+05:30 IST

గడిచిన ఆరు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎక్కడా ఒక్క ఘర్షణ కూడా చోటుచేసుకోలేదని ..

ఆరేళ్లలో ఒక్క ఘర్షణ జరగలేదు

1947 తర్వాత ఇదే తొలిసారి.. సైబ్‌-హర్‌ ఇక్కడే మొదలు: డీజీపీ 


హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): గడిచిన ఆరు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎక్కడా ఒక్క ఘర్షణ కూడా చోటుచేసుకోలేదని డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. 1947 తర్వాత ఇంత సుదీర్ఘకాలం ప్రశాంతంగా ఉండటం ఇదే మొదటిసారి అని ఆయన చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని చెప్పేందుకు ఇదే నిదర్శనమన్నారు.  దేశంలోనే అత్యుత్తమ పోలీసింగ్‌ తెలంగాణలోనే ఉందని చెప్పా రు. మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో నెలరోజులుగా కొనసాగిన సైబ్‌-హర్‌ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ఆయన వర్చువల్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు.


కొవిడ్‌-19 నేపథ్యంలో మహిళలు, చిన్నారుల్లో ఇంటర్నెట్‌ వినియోగం పెరిగిందని, వారు సైబర్‌ నేరాల బారిన పడకుండా సైబ్‌-హర్‌ పేరుతో నెల రోజులపాటు చైతన్య కార్యక్రమాన్ని దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో నిర్వహించామన్నారు. ‘‘ఈ కార్యక్రమాల్లో తెలంగాణతోపాటు.. ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన 50లక్షల మంది పాల్గొనడం గొప్ప విషయమన్నారు.కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ అందుబాటులోకి వస్తే.. నేర నియంత్రణలో అత్యాధునిక సౌకర్యాలున్న టవర్‌గా.. దేశంలో మొట్ట మొదటిదిగా నిలుస్తుందని చెప్పారు. తాము చేపట్టిన సైబ్‌-హర్‌ స్ఫూర్తితో ఏపీ, థానే పోలీసులూ అలాంటి కార్యక్రమాలను ప్రారంభించారని డీఐజీ సుమతి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా మై విలేజ్‌ షో గంగవ్వ హాజరయ్యారు.

Updated Date - 2020-08-15T10:06:11+05:30 IST