విగ్రహాల ధ్వంసంపై ఏపీ డీజీపీ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-01-15T22:54:46+05:30 IST

కొన్ని రాజకీయ పార్టీలు ఆలయాలపై దాడులను దుష్ప్రచారం చేస్తున్నాయని డీజీపీ గౌతం సవాంగ్ తప్పుపట్టారు

విగ్రహాల ధ్వంసంపై ఏపీ డీజీపీ కీలక వ్యాఖ్యలు

అమరావతి: కొన్ని రాజకీయ పార్టీలు ఆలయాలపై దాడులను దుష్ప్రచారం చేస్తున్నాయని డీజీపీ గౌతం సవాంగ్ తప్పుపట్టారు. డీజీపీ మీడియాతో మాట్లాడారు. ‘9 కేసుల్లో పలువురు రాజకీయ పార్టీల నేతలు నేరుగా ప్రమేయం ఉన్నట్టు గుర్తించాం. ఇందులో 15 మందిని ఇప్పటికే అరెస్టు చేశాం. దీన్ని బట్టి చూస్తే ఇది ప్రణాళిక ప్రకారమే అసత్య ప్రచారం చేస్తున్నట్టు అర్థం అవుతోంది. కొందరు సోషల్ మీడియా, సైబర్ క్రైం, డిజిటల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు. మతాల మధ్య వైషమ్యాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ఆలయాలపై దాడులకు సంబంధించి పోస్టులు పెడుతున్న ఫాస్టర్ వ్యవహారంపై సీఐడీ విచారణ చేస్తోంది. దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఫోకస్ పెట్టాం. పోస్టులను ఫార్వార్డ్ చేసే వారిపై కూడా చర్యలు ఉంటాయి. 13296 ఆలయాల దగ్గర సెప్టెంబర్ ముందు 44521 సీసీ కెమెరాలు ఉన్నాయి. సెప్టెంబర్ తర్వాత 31216 కెమెరాలు ఏర్పాటు చేశాం. ఆలయాల భద్రతలో మ్యాపింగ్, సీసీ కెమెరాలు కీలకం. పోలీస్ భద్రతతో పాటు టెంపుల్ కమిటీలు, మత సామరస్య కమిటీలు సమన్వయం చేస్తున్నాయి’ అని డీజీపీ పేర్కొన్నారు.


‘ఆలయాల దాడుల్లో పాత్ర ఉండి పరారీలో ఉన్నవారిని కూడా అరెస్ట్ చేస్తాం. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు. ఆలయాలకు సంబంధించి 44 ఘటనల్లో 29 కేసులు ఛేదించాం. 81 మంది నేరస్థులను అదుపులోకి తీసుకున్నాం. ఆలయాల్లో నేరాలకు సంబంధించి 180 కేసులు ఛేదించాం’ అని డీజీపీ సవాంగ్ స్పష్టం చేశారు.

Updated Date - 2021-01-15T22:54:46+05:30 IST