ఆలయం అనగానే టెంకాయ, లడ్డు, పూలు, పండ్లు తదితర వస్తువులు గుర్తుకొస్తాయి. కానీ పీతలతో స్వామికి అభిషేకం చేయడం ఏంటని అనుకుంటున్నారా ? వినడానికి వింతగా ఉన్నా.. ఇది మాత్రం నిజం. ఆ శివాలయానికి వచ్చే భక్తులంతా స్వామికి నైవేద్యం సమర్పించేందుకు.. ఏ వస్తువులను తీసుకెళ్లకున్నా.. పీతలను మాత్రం విధిగా తీసుకొస్తారు. బతికున్న పీతలతో స్వామికి అభిషేకం చేసిన అనంతరం.. వాటినే స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. వివరాల్లోకి వెళితే..
ఈ విచిత్ర సాంప్రదాయం.. గుజరాత్ రాష్ట్రం సూరత్లోని రుంద్నాథ్ మహదేవ్ ఆలయంలో ఎప్పటినుంచో కొనసాగుతోంది. నిత్యం వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. రామ్నాథ్ ఘేలా శ్మశాన వాటికలో ఉన్న ఈ ఆలయంలో ఏడాదికోసారి మాఘమాస ఏకాదశి రోజున పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో ఆలయం భక్తులతో కిక్కిరిసి ఉంటుంది. భక్తులంతా తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటూ బతికున్న పీతలను తీసుకొచ్చి, శివుడికి అభిషేకం చేస్తుంటారు.
వేరే ఏ ప్రసాదం లేకున్నా పీతలను మాత్రం విధిగా తీసుకొస్తుంటారు. ఇలా పూజలు చేయడం వల్ల శారీరక రుగ్మతలు నయమవుతాయని భక్తుల నమ్మకం. అలాగే చెవుడు తదితర సమస్యలు కూడా తగ్గిపోతాయని విశ్వసిస్తారు. స్వామికి పూజలు చేసిన అనంతరం అక్కడి శ్మశానంలోని వారి వారి బంధువుల సమాధుల వద్ద ప్రార్థనలు నిర్వహిస్తారట.
ఇవి కూడా చదవండి