Tirumala: శ్రీవారి ఆలయంలో 8 నుంచి పవిత్రోత్సవాలు
ABN , First Publish Date - 2022-07-22T02:11:29+05:30 IST
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి.
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ముందురోజు 7న అంకురార్పణతో ఈఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవితోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఉత్సవాల్లో భాగంగా మూడ్రోజులపాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి.. భక్తులకు దర్శనమిస్తారు. ఆగస్టు 8న పవిత్ర ప్రతిష్ఠ, 9న పవిత్ర సమర్పణ, 10న పూర్ణాహుతి ఉంటాయి. 7న అంకురార్పణ సందర్భంగా సహస్రదీపాలంకార సేవ, 9న అష్టదళ పాదపద్మారాధనతోపాటు 8 నుంచి పదో తేదీవరకు కల్యాణోత్సవం, ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార, ఊంజల్ సేవలను రద్దు చేశారు.