పరిమితసంఖ్యలోనే భక్తులను అనుమతించాలి
ABN , First Publish Date - 2020-06-07T07:57:23+05:30 IST
జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి ఆలయాలు తెరవాలనీ, పరిమితసంఖ్యలోనే భక్తులను
ఈవోలు, దేవదాయ అధికారులకు కలెక్టర్ సూచన
చిత్తూరు కలెక్టరేట్, జూన్ 6: జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి ఆలయాలు తెరవాలనీ, పరిమితసంఖ్యలోనే భక్తులను అనుమతించాలని కలెక్టరు భరత్గుప్తా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మీటింగ్హాలులో ఆయన శ్రీకాళహస్తి, కాణిపాకం ఈవోలు, దేవదాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ... కాణిపాకం సహా అన్ని ఆలయాల్లో భక్తులకు థర్మల్ స్ర్కీనింగ్ నిర్వహించి, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
స్వామి దర్శనార్థం వచ్చే భక్తుల పేర్లు, ఆధార్, మొబైల్ తదితర వివరాలను నమోదు చేయాలన్నారు. ఆలయ సిబ్బంది కూడా రెండుషిప్టుల్లో పనిచేయాలనీ, ప్రతి ఆలయంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని కోరారు. అయితే కోవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా శ్రీకాళహస్తి ఆలయ ప్రారంభం విషయమై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని కలెక్టర్ వెల్లడించారు. జేసీ చంద్రమౌళి, శ్రీకాళహస్తి, కాణిపాకం ఈవోలు చంద్రశేఖర్రెడ్డి, వెంకటేశు, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ ఏకాంబరం తదితరులు పాల్గొన్నారు.