కృష్ణాజిల్లా: మైలవరంలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-02-28T17:48:04+05:30 IST
మైలవరంలో ఉద్రిక్తత నెలకొంది. మైలవరంను రెవిన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ...
కృష్ణా జిల్లా: మైలవరంలో ఉద్రిక్తత నెలకొంది. మైలవరంను రెవిన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు. ప్రభుత్వం స్థలంలో దీక్షలకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో దేవినేని ఉమ, టీడీపీ శ్రేణులతో ర్యాలీగా వచ్చి గౌతు లచ్చన్న విగ్రహం వద్ద దీక్షకు కూర్చున్నారు.
ఈ సందర్భంగా దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మైలవరం రెవిన్యూ డివిజన్ కోసం ప్రాణాలైన అర్పిస్తానన్నారు. తమపై తప్పుడు కేసులు పెట్టి 10 రోజులు రాజమండ్రి జైలులో ఉంచారని, అవసరమైతే గుండాలతో ప్రాణాలు కూడా తీయిస్తారన్నారు. ఈ పాలనలో అంతకు మించి ఎం చేస్తారన్నారు. తాము రెవిన్యూ డివిజన్ కోసం పోరాడుతుంటే.. జగన్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. పోలీసులు దీక్షలను అడ్డుకున్నా.. సాయంత్రం 5 గంటల వరకు దీక్షలు కొనసాగిస్తామని దేవినేని ఉమ స్పష్టం చేశారు. తనపై కక్షతోనే మైలవరంను రెవిన్యూ డివిజన్గా ప్రకటించలేదన్నారు. మైలవరంను రెవిన్యూ డివిజన్గా ప్రకటిస్తే 70 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. మైలవరంను రెవిన్యూ డివిజన్గా ప్రకటించే వరకు పోరాటం చేస్తామని దేవినేని ఉమ స్పష్టం చేశారు.