దేవుడి భూములూ వదలరా?
ABN , First Publish Date - 2020-07-11T08:37:02+05:30 IST
దేవుడి భూములూ వదలరా?
- స్థలాలు కాజేసే మంత్రిపై ఏం చర్యలు తీసుకుంటారు: దేవినేని ఉమ
విజయవాడ, జూలై 10: దళితులు, బీసీల భూములను ఇళ్ల స్థలాల పేరుతో లాక్కుంటున్న వైసీపీ ప్రభుత్వం చివరికి దేవుడి భూములనూ వదలడం లేదని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. పేదలకు భూమి ఇస్తున్నట్టే ప్రజాప్రతినిధులకూ భూముల కబ్జా స్కీమును ఏమైనా అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. విజయవాడలోని శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన రూ.10 కోట్ల విలువైన భూమిని స్వాహా చేసే ప్రయత్నాన్ని ‘ఆంధ్రజ్యోతి’ శుక్రవారం వెలుగులోకి తెచ్చింది.
ఈ కథనం దేవదాయ శాఖలో కలకలం రేపింది. సుమారు 900 గజాల స్థలాన్ని శ్రీభువనేశ్వరి పీఠానికి అప్పగించడంపై న్యాయపరమైన అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే ఓ నిర్ణయానికి రావాలని ఆ శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ వ్యవహారంపై దేవినేని ఉమా ట్విటర్లో స్పందించారు. ‘ముఖ్యమంత్రి గారూ దయచేసి మీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నుంచి దేవుడిని, దేవుడి స్థలాలను కాపాడండి’ అని ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు.