అడుగడుగునా అడ్డంకులే..
ABN , First Publish Date - 2021-08-06T06:24:15+05:30 IST
అడుగడుగునా అడ్డంకులే..
దేవినేని ఉమాపై పోలీసుల హడావుడి
బెయిల్పై విడుదలై వస్తుండగా దారి పొడవునా అడ్డగింపులు
హనుమాన్ జంక్షన్ ఆంజనేయస్వామి ఆలయం మూసివేత
మాజీ ఎమ్మెల్యేలు సౌమ్య, శ్రీరాం తాతయ్య గృహ నిర్బంధం
విజయవాడ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : బెయిల్పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. దేవినేని ఉమ.. తన అనుచరులు, టీడీపీ నాయకులతో కలిసి గురువారం జైలు నుంచి ర్యాలీగా బయల్దేరిన విషయం తెలుసుకున్న పోలీసులు జాతీయ రహదారిపై ఎక్కడపడితే అక్కడ ఆటంకాలు సృష్టించారు. ఆయనకు స్వాగతం పలికేందుకు వెళ్లిన టీడీపీ నాయకులు, శ్రేణులను అడ్డుకున్నారు. గన్నవరంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, ఇతర నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. హనుమాన్ జంక్షన్లో అభయాంజనేయస్వామి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించే అవకాశం ఉందని తెలిసి ఆలయాన్ని మూసివేయించారు. గొల్లపూడి వన్ సెంటర్లోనూ, దేవినేని ఉమ ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. కాగా, టీడీపీ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ నాయకులకు ఒక న్యాయం, ప్రతిపక్ష నేతలకు మరొక న్యాయమా? అని ప్రశ్నించారు.
అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులా : బుద్దా వెంకన్న
అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తారా? అంటూ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నించారు. కొండపల్లిలో అక్రమ మైనింగ్పై ప్రశ్నించినందుకు మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు అరెస్టైన టీడీపీ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు రామినేని రాజా, జి.కొండూరుకు చెందిన అంకెం సురేశ్, చనుమోలు బాబు, ఉయ్యూరు నరసింహారావు కుటుంబ సభ్యులను గురువారం టీడీపీ నేతలు నాగుల్మీరా, జంపాల సీతారామయ్య, తదితర నాయకులతో కలిసి ఆయన పరామర్శిం చారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.