అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-03-09T07:36:37+05:30 IST
ఉపాధి హామీపథకం అనుసంధానంతో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ పోలా భాస్కర్ అదేశించారు.
ఒంగోలు(కలెక్టరేట్), మార్చి 8 : ఉపాధి హామీపథకం అనుసంధానంతో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ పోలా భాస్కర్ అదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశపు హాలులో సోమవారం పలు శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 340 కోట్ల మేర వివిధ అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. ఈనెలాఖరుకు మరో రూ.100 కోట్ల మేర పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అదేశించారు. గ్రామాల్లో రూ. 80 కోట్ల నిధులతో సీసీరోడ్ల నిర్మాణాలుచేపట్టాల్సి ఉండగా ఇంత వరకు కొన్ని పనులు ప్రారంభించకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నాడు-నేడు పాఠశాలల అభివృద్ధి భాగంగా 600 పనులకు రూ. 24.70 కోట్ల నిధులతో పూర్తి చేయాల్సి ఉందన్నారు. పనుల వారీగా సమీక్షించిన కలెక్టర్ ఆయా పనులను ఈనెలాఖరు నాటికి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ టీఎస్ చేతన్, వివిధ శాఖల అధికారులు శీనారెడ్డి, మర్దన్ ఆలి, కొండయ్య, సాయినాథ్కుమార్, నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.