మట్టితోనే మమ..
ABN , First Publish Date - 2021-04-17T06:40:36+05:30 IST
మీర్పేట్ కార్పొరేషన్ పరిధి జిల్లెలగూడలో గల చందనచెరువు సుందరీకరణలో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.
రింగ్బండ్’ ఉంటుందా.. కొట్టుకు పోతుందా?
చందనచెరువు రాతి గోడ నిర్మాణంపై నిర్లక్ష్యం
భారీ వర్షం పడితే కష్టమే
సరూర్నగర్, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): మీర్పేట్ కార్పొరేషన్ పరిధి జిల్లెలగూడలో గల చందనచెరువు సుందరీకరణలో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. చెరువు చుట్టూ నెక్లెస్ రోడ్డును తలపించేలా నిర్మించిన ‘రింగ్ బండ్’ నాణ్యతపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గత అక్టోబరు నాటి భారీ వర్షాలకు చెరువు ప్రధాన కట్ట సైతం తెగుతుందేమో అనే భయాందోళనలు వ్యక్తమయిన సంగతి తెలిసిందే. అలాంటి పరిస్థితి వస్తే ప్రస్తుతం చెరువు చుట్టూ నిర్మించిన ‘రింగ్ బండ్’ పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఓ గంటపాటు సాధారణ వర్షం కురిసినా ఈ చెరువులోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద భారీ స్థాయిలో వరద నీరు చేరుతోంది. రింగ్బండ్ను ఎంతో నాణ్యతగా నిర్మించాల్సి ఉండగా, కేవలం భవన నిర్మాణ వ్యర్థాలను వేసి, వాటిపై మట్టి పోసి చదును చేసి వదిలేశారు. సదరు రింగ్ బండ్పై గ్రీనరీని తలపించేలా ఫెన్సింగ్ సైతం ఏర్పాటు చేశారు.
వరద వస్తే తట్టుకోగలదా..?
ఇక తాజాగా సుందరీకరణ పేరుతో నిర్మించిన రింగ్ బండ్ భారీ వరదలను ఏ మేరకు తట్టుకుని నిలువగలదన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎగువ నుంచి ఒక్కసారిగా వరద వస్తే నెక్లెస్ రోడ్డు తుడిచిపెట్టుకు పోయే ప్రమాదం లేకపోలేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాతి గోడ (రిటెయినింగ్ వాల్) నిర్మిస్తేనే..
చందన చెరువు ప్రమాదకరంగా మారడంతో సుందరీకరణలో భాగంగా ప్రధాన కట్టకు రాతి గోడ (రిటెయినింగ్ వాల్) నిర్మించారు. అదే విధంగా రింగ్బండ్కు బతుకమ్మ ఘాట్ వరకు మాత్రమే రాతి గోడ నిర్మించారు. ఆ తర్వాత చుట్టూ నిర్మించిన రింగ్బండ్ కేవలం మట్టితోనే పూర్తి చేసి చేతులు దులుపుకున్నారు. రోడ్డు రోలర్తో తొక్కించినందున ప్రస్తుతం కాస్త గట్టిగా కనిపిస్తున్నా.. వర్షం పడి వరద వస్తే ఆ మట్టి కొట్టుకుపోయి రింగ్బండ్కు ప్రమాదం తలెత్తే అవకాశం లేకపోలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రూ.నాలుగు కోట్ల వ్యయంతో చేపట్టిన చెరువు సుందరీకరణలో అడుగడుగునా ఇలాంటి లోపాలు కనిపిస్తున్నాయి. అయినా అధికారులు వాటి గురించి పట్టించుకోకుండా ఇష్టానుసారంగా పనులు చేయిస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పం దించి రింగ్బండ్ పటిష్టతకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.