40 గంజాయి మొక్కల ధ్వంసం
ABN , First Publish Date - 2021-10-27T05:41:44+05:30 IST
వర్ని మండలం పైడిమాల్ గ్రామంలో ఇంటి ఆవరణలో సాగు చేసిన 40 గంజాయి మొక్కలను ఎక్సైజ్ పోలీసులు మంగళవారం ధ్వంసం చేశారు.
సుభాష్నగర్, అక్టోబరు 26: వర్ని మండలం పైడిమాల్ గ్రామంలో ఇంటి ఆవరణలో సాగు చేసిన 40 గంజాయి మొక్కలను ఎక్సైజ్ పోలీసులు మంగళవారం ధ్వంసం చేశారు. పైడిమాల్ గ్రామం పరిధిలోని కొకల్దాస్ తండాకు చెందిన బర్దావత్ కిషన్, రాయిలా అనే ఇద్దరు వ్యక్తులు తమ ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు సాగుచేస్తున్నారన్న పక్కా సమాచారంతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఇన్చార్జి ఎస్హెచ్వో సాయన్న ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 8 అడుగుల ఎత్తులో పెరిగిన మొక్కలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్చంద్ర తెలిపారు. ఇద్దరు నిందితులను బోధన్ ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించడం జరిగిందన్నారు. ఈ దాడుల్లో సంగయ్య, సరిత, నవిన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.