బాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఎన్సీబీ ముందుకు డిజైనర్ సిమోన్
ABN , First Publish Date - 2020-09-24T17:18:16+05:30 IST
బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబాట్టా ఇవాళ..
ముంబై: బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబాట్టా ఇవాళ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ముందు హాజరయ్యారు. ఉదయం 9:30 గంటల సమయంలో ఆమె దక్షిణ ముంబైలోని కొలాబా ఎన్సీబీ గెస్ట్ హౌస్కి చేరుకున్నట్టు ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. డ్రగ్స్ వ్యవహారంపై ఎన్సీబీ అధికారులు కొందరు వ్యక్తులను ప్రశ్నిస్తున్న సందర్భంగా సిమోన్ పేరు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా గురువారం విచారణకు హాజరు కావాల్సిందిగా సిమోన్తో పాటు హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్, టాలెంట్ మేనేజర్ శ్రుతి మోదీలకు కూడా ఎన్సీబీ నోటీసులు జారీ చేసినట్టు ఎన్సీబీ అధికారి ఒకరు పేర్కొన్నారు. ముంబై నుంచి గానీ, హైదరాబాద్ నుంచి గానీ తనకు ఎలాంటి సమన్లు అందలేదని రకుల్ చెబుతుండగా.. ఎన్సీబీ అధికారులు మాత్రం ఆమెకు సమన్లు పంపినట్టు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే పలు మెసేజింగ్ యాప్లతో పాటు అధికారుల వద్ద అందుబాటులో ఉన్న ఓ ఫోన్ నంబర్ ద్వారా కూడా రకుల్ను ఎన్సీబీ సంప్రదించిందనీ.. అయినప్పటికీ ఆమె నుంచి ఎలాంటి స్పందనా రాలేదని తెలిసింది.
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణంపై ఎన్సీబీ అధికారులు ప్రస్తుతం ముమ్మర విచారణ జరుపుతున్నారు. తాజాగా మరికొంత మంది పేర్లు బయటికి రావడంతో దర్యాప్తును విస్తృతం చేసి ముంబై సినీ పరిశ్రమలోని కొందరు ‘‘ఎ-లిస్ట్’’ సెలబ్రిటీలను ‘‘విచారణకు రావాలంటూ కోరినట్టు’’ ఓ సీనియర్ అధికారి నిన్న మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన సుశాంత్ గర్ల్ఫ్రెండ్ రియా చక్రవర్తిని విచారిస్తున్న సందర్భంగా రకుల్, సారా అలీఖాన్ పేర్లు ప్రస్తావనకు వచ్చినట్టు ఎన్సీబీ అధికారులు ఇటీవల వెల్లడించారు. విచారణకు రావాల్సిందిగా బుధవారం ఎన్సీబీ నుంచి నోటీసులు అందుకున్న వారిలో హీరోయిన్లు దీపికా పదుకునే, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు కూడా ఉన్నారు.