YSRCP : డిప్యూటీ సీఎం ఫ్లెక్సీలపై పెట్రోలు పోసి కాల్చేశారు.. ఆ గొడవలే కారణమా!

ABN , First Publish Date - 2021-08-31T12:53:25+05:30 IST

మంత్రి నారాయణస్వామి ఫొటోలపై పెట్రోల్‌ పోసి కాల్చేశారని..

YSRCP : డిప్యూటీ సీఎం ఫ్లెక్సీలపై పెట్రోలు పోసి కాల్చేశారు.. ఆ గొడవలే కారణమా!

  • సాతంబాకంలో కాల్చేసిన వైసీపీ ఫ్లెక్సీలు 
  • సొంతపార్టీలో గొడవలే కారణమా!

చిత్తూరు జిల్లా/పెనుమూరు : మండలంలోని సాతంబాకం పంచాయతీలో పలుచోట్ల వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి కాల్చేశారు. సోమవారం ఉదయం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ నరేంద్ర వాటిని పరిశీలించి నిందితులను పట్టుకుంటామని తెలిపారు. సాతంబాకం పంచాయతీ సర్పంచ్‌గా వైసీపీ రెబల్‌గా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందిన జయచంద్రారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈనెల 20వ తేదీన అభిమానులు, మిత్రులు పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు సాతంబాకం మెయిన్‌ రోడ్డు, సచివాలయం వద్ద ఉన్న ఫ్లెక్సీలలో సర్పంచ్‌, మంత్రి నారాయణస్వామి ఫొటోలపై పెట్రోల్‌ పోసి కాల్చేశారని సర్పంచ్‌, మరికొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.


వారు మాట్లాడుతూ 21వ తేది రాత్రే గుర్తుతెలియని వ్యక్తులు అందులో ఒక పొటోను కత్తిరించారని, దాన్ని మళ్లీ అతికించామన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వారు ఇలాంటి చర్యలకు పాల్పడలేదని, తమను ఎదుర్కోలేక సొంత పార్టీ వారే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని, నిందితులని త్వరగా పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఆయనే స్వయంగా పోలీసులకు సూచించినట్లు సమాచారం.

Updated Date - 2021-08-31T12:53:25+05:30 IST