రీ సర్వేలో వేగం పెంచాలి: ధర్మాన
ABN , First Publish Date - 2021-04-17T09:49:27+05:30 IST
రాష్ట్రంలో భూ వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ సర్వేను మరింత వేగంగా ముందుకు
అమరావతి, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూ వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ సర్వేను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం తొలి దశ సర్వే పనులు సాగాలని, ఇందుకు నిర్దిష్ట ప్రణాళికను పాటించాలన్నారు. శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి రీసర్వేతోపాటు పలు రెవెన్యూ అంశాలపై ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్, ముఖ్యకార్యదర్శి వి.ఉషారాణి, సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్ సిద్ధార్థ్ జైన్, సీసీఎల్ఏ కార్యదర్శి చక్రవర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు 50 గ్రామాల్లో భూముల మ్యాపింగ్ పరిశీలన పూర్తిచేసినట్లు అధికారులు నివేదించారు. వీఆర్వో, వీఆర్ఏ, జూనియర్ అసిస్టెంట్ల పదోన్నతులపై చర్చ జరిగింది. వివాదాలకు తావులేకుండా పదోన్నతులు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. విశాఖలో పెట్రోకెమికల్ విశ్వవిద్యాలయం భూమి విషయంలో నెలకొన్న వివాదాలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను మంత్రి ధర్మాన ఆదేశించారు.