ఆశ్రిత వ్యాపార వైభవం

ABN , First Publish Date - 2021-01-20T09:09:15+05:30 IST

ఒకప్పుడు ప్రభుత్వ నియమాలను అవకాశంగా తీసుకుని వ్యాపార సామ్రాజ్యాలు విలసిల్లాయి, విస్తరిల్లాయి. ఇప్పుడు కేవలం ప్రభుత్వ సహాయంతో...

ఆశ్రిత వ్యాపార వైభవం

ఒకప్పుడు ప్రభుత్వ నియమాలను అవకాశంగా తీసుకుని వ్యాపార సామ్రాజ్యాలు విలసిల్లాయి, విస్తరిల్లాయి. ఇప్పుడు కేవలం ప్రభుత్వ సహాయంతో మాత్రమే వ్యాపారాలకు పునాదులు వేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంబానీతో మొదలైన ఈ సంప్రదాయం ఇప్పుడు అదానీతో పూర్తిగా వేళ్లూనుకుపోయింది.


అపరిమితంగా పెరిగిపోతున్న ఇంధన అవసరాలు ఇటీవలి కాలంలో పాలకులకు, వారి అస్మదీయ వ్యాపారవేత్తలకు కామధేనువులుగా పరిణమించాయి. సహజ వాయువు ఆధారిత విద్యుదుత్పత్తి వల్ల వినియోగదారులకు ఎంతవరకు లబ్ధి చేకూరుతుందో తెలియదు కానీ రాజకీయ నాయకులకు మాత్రం గరిష్ఠంగా ప్రయోజనం కలుగుతోంది. తత్ఫలితంగా సహజవాయువు ఆధారిత విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు‌రంగానికి అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. 


అరేబియా సముద్ర తీరంలో ఉన్న గుజరాత్‌కు అవతలి వైపు గల్ఫ్లోని ఖతర్, ఒమాన్ దేశాలలో సహజవాయువు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. మన దేశానికి నిత్యం అవసరమైన 157 మిలియన్ క్యూబిక్ మీటర్ల సహజవాయువు అవసరాలలో సగానికి పైగా ఖతర్ ఒక్కటే తీరుస్తోంది. బొగ్గు బదులుగా గల్ఫ్ నుంచి దిగుమతి చేసుకున్న గ్యాస్ ఆధారంగా ప్రస్తుతం గుజరాత్, మహారాష్ట్రలోని అనేక విద్యుదుత్పత్తి సంస్థలు విజయవంతంగా నడుస్తున్నాయి. సింగరేణి లేదా ఇతర బొగ్గుగనులు ఉన్న రాష్ట్రాల నుంచి గుజరాత్‌కు బొగ్గు రవాణా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అదే గల్ఫ్ నుంచి గ్యాస్ దిగుమతి దేశీయ బొగ్గు కంటే కూడా చౌక. దీంతో అదానీ గ్రూప్ అరేబియా సముద్రతీరంలోని ముంద్రలో 14 వేల కోట్ల వ్యయంతో 2 వేల మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతోంది. అదే విధంగా, ముంబాయి మహానగర విద్యుత్ సరఫరా సంస్థలో అదానీతో కలిసి ఖతర్ 3,220 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. ఆంధ్రప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాలలో విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టులకు అదానీ కంపెనీ ప్రణాళికలు రచించింది. 


భారత్ ఇంధన అవసరాలలో 6.3 శాతం మేరకు ప్రస్తుతం సహజ వాయువుతో తీరుతున్నాయి. ప్రస్తుత దశాబ్దాంతానికి సహజవాయువు వినియోగాన్ని 15 శాతానికి పెంచాలని కేంద్రం పట్టుదలతో ఉంది. ఇందుకోసం దేశంలో దాదాపు 30 వేల కిలోమీటర్ల మేరకు పైపులైన్లను నిర్మించే కాంట్రాక్టులను కూడా అదానీ గ్రూప్ దక్కించుకుంది. ప్రధాన చమురు దిగుమతిదారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా అదానీ కంపెనీలో కేంద్రం ఇప్పటికే పెట్టుబడులు పెట్టింది. ఇంకా భారీ మదుపులు చేయాలని ఇప్పుడు ఖతర్‌ను కోరుతోంది. ఈ విషయమై చర్చించడానికి విదేశాంగమంత్రి యస్. జైశంకర్ ఇటీవల ఖతర్‌కు వచ్చి వెళ్ళారు. ఇతర గల్ఫ్ దేశాల నుంచి కూడా అదానీ గ్రూప్‌కు పెట్టుబడులను ఆకర్షించడానికి కేంద్రప్రభుత్వ పెద్దలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఔత్సాహిక పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చూరగొనడం కోసం మౌలిక వసతులను అభివృద్ధి పరుస్తున్నారు. అదానీ గ్రూప్‌కు ఆంధ్రప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాలు కూడా అండగా నిలుస్తున్నాయి. నరేంద్రమోదీ ప్రభుత్వం తన అస్మదీయుల పట్ల ప్రదర్శించే కటాక్ష, కారుణ్యాలు అపారమైనవి. అదానీ గ్రూప్ లాభాల పట్టికను మోదీ సర్కార్ కంటే ముందు, ఆ తరువాత దిశగా గమనిస్తే ఈ వాస్తవం అవగతమవుతుంది. 

మొహమ్మద్ ఇర్ఫాన్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి

Updated Date - 2021-01-20T09:09:15+05:30 IST