కర్ణాటక, పటాన్చెరు వెళ్లింది వాస్తవం... కోడిపందాలపై Chintamaneni స్పందన
ABN , First Publish Date - 2022-07-08T19:17:03+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో కోడిపందాలపై దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పందించారు.
ఏలూరు: తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో కోడిపందాలపై దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్(Chintamaneni prabhakar) స్పందించారు. ‘‘నేను కోడిపందాలు ఆడతానని రెండు రాష్ట్రాల ప్రజలకు, పోలీసులకు, మీడియాకు తెలుసు. నేను కోడిపందాలకు వెళ్ళడం అనేది సహజమైన విషయం.దాని గురించి ఎందుకు రాద్ధాంతం. చిన్నప్పటి నుంచి కోడిపందాలు ఆడడం నా వ్యసనం. అది ఘోరమో, నేరమో కాదు. కర్ణాటక, పటాన్ చెరు వెళ్లింది వాస్తవం. చట్టం దృష్టిలో నేరం కాబట్టి పోలీసులు వచ్చే సమయంలో అక్కడ ఉండకూడదని వెళ్లిపోయా. నేను తప్పుకున్నానని అంటే, పారిపోయానని మీరంటున్నారు. పోలీసులు వస్తున్నారని అక్కడ వారు చెప్పారు కాబట్టి నేను, నా కోళ్లు, కారు సేఫ్గా తప్పుకున్నాము. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉంది... కానీ నా బలహీనతను ఆపుకోలేక వెళ్లాను. పోలీసులు వచ్చే సమయంలో అక్కడ లేను. అంతకుముందు అక్కడ ఉన్నప్పుడు తీసిన ఫోటోలు, వీడియోలు మీడియాకు రిలీజ్ చేశారు. నేను పందాలు నిర్వహించి నా కుటుంబాన్ని, పార్టీని పోషించుకోవాల్సిన అవసరం లేదు. కర్ణాటక కోడిపందాలకు వెళ్లి వస్తుండగా భోజనానికి పిలిచారు. నన్ను ఇరికించడానికి పెద్ద స్కెచ్ వేసారు. దానికి నేను దొరకలేదు. నిందితులు అందరికీ 41ఏ నోటీసులు ఇవ్వాలని కోర్టు పోలీసులకు చివాట్లు పెట్టింది’’ అని చింతమనేని ప్రభాకర్ అన్నారు.