భారీగా మిగిలిన ‘సీట్లు’.. తుది కౌన్సెలింగ్ ఎప్పుడంటే..
ABN , First Publish Date - 2021-11-15T14:07:49+05:30 IST
రాష్ట్రంలో..
ఎంసీఏ సీట్లకు డిమాండ్ !
భారీగా మిగిలిన ఎంబీఏ సీట్లు.. ఐసెట్ సీట్ల కేటాయింపు
27, 28, 29 తేదీల్లో తుది కౌన్సెలింగ్
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎంసీఏ సీట్లకు డిమాండ్ నెలకొంది. మొత్తం సీట్లలో మొదటి దశ కౌన్సెలింగ్లోనే 98 శాతం భర్తీ అయ్యాయి. మరో పక్క ఎంబీఏ సీట్లకు డిమాండ్ తక్కువగా ఉంది. 69 శాతం మాత్రమే నిండాయి. రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ (ఐసెట్) సీట్లను ఆదివారం కేటాయించారు. ఐసెట్లో మొత్తం 51,316 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. 22,416 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరయ్యారు. 21,811 మంది వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మొత్తం 26,845 సీట్లు ఉన్నాయి. కౌన్సెలింగ్లో భాగంగా ఆదివారం సుమారు 19,209 సీట్లు భర్తీ అయ్యాయి. ఎంసీఏ సీట్లతో పోలిస్తే... ఎంబీఏలో సీట్లు ఎక్కువగా మిగిలాయి.
ఎంబీఏ కోర్సుల్లో మొత్తం 24,478 సీట్లు ఉండగా, 16,886 సీట్లు భర్తీ అయ్యాయి. 7,592 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎంసీఏ కోర్సులో 2,367 సీట్లు ఉండగా, 2,323 నిండాయి. సుమారు 28 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. కాగా, 484 మంది అభ్యర్థులు ఈడబ్ల్యుఎస్ కోటా కింద సీట్లను పొందారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 18వ తేదీలోపు ట్యూషన్ ఫీజును చెల్లించి, కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంది. లేకుంటే సీటు రద్దవుతుందని అధికారులు ప్రకటించారు. మిగిలిన సీట్ల భర్తీ కోసం తుది దశ కౌన్సెలింగ్ను ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీల మధ్య నిర్వహించనున్నారు.