డిమాండ్ ఎక్కువ.. సరఫరా తక్కువ
ABN , First Publish Date - 2021-05-17T05:40:10+05:30 IST
గతంలో కోవ్యాగ్జిన్ వేసుకుని 28 రోజులు పూర్తయిన వారికి మంగళవారం నుంచి రెండో మోతాదు టీకా వేయనున్నట్లు మేడికుర్తి వైద్యాధికారి డాక్టర్ చిన్నరెడ్డెప్ప తెలిపారు.
కలికిరి, మే 16: గతంలో కోవ్యాగ్జిన్ వేసుకుని 28 రోజులు పూర్తయిన వారికి మంగళవారం నుంచి రెండో మోతాదు టీకా వేయనున్నట్లు మేడికుర్తి వైద్యాధికారి డాక్టర్ చిన్నరెడ్డెప్ప తెలిపారు. ఆదివారం నుంచి అర్హులైన వారందరికీ ఏఎన్ఎం, ఆశా కార్యకర్తల ద్వారా ఇళ్ల వద్దే టోకెన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. సీనియారిటీ (ప్రాధాన్యత) ప్రకారం టీకాలు వేస్తామని పేర్కొన్నారు. కలికిరి మండలానికి 270 డోసుల వ్యాక్సిన్ సరఫరా అయినట్లు వివరించారు. కాగా మండలంలో కోవ్యాగ్జిన్ రెండో మోతాదు వేసుకోవలసిన అర్హులు దాదాపు 800 మంది దాకా ఉన్నారు. ఇందులో కొందరికి 50 రోజులు కూడా పూర్తయిపోయింది. ఈ నెల 8 కేవలం వంద మందికి సరిపడే డోసులు సరఫరా కాగా వాటిలో ఎక్కువగా స్థానికులు కాని వారికి చేరిపోవడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండో మోతాదుకు అర్హత ఉన్న వారిలో హెల్త్ లైన్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎక్కువగా ఉన్నారు. ఇక ఈ విడతలో కూడా కోవ్యాగ్జిన్ అందక మిగిలిపోయే దాదాపు 500 మంది పరిస్థితి ఏమిటన్న విషయంలో స్పష్టత లేదు. మంగళవారం మొదటి డోసు ఎవరికీ వేసేది లేదని అధికారులు స్పష్టం చేశారు. మండలానికంతా కలిపి కలికిరి సీహెచ్సీలో ఒకే కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీవో వెంకటేశులు తెలిపారు.