క్లీనింగ్.. కేరింగ్!
ABN , First Publish Date - 2020-06-30T10:02:02+05:30 IST
కరోనా భయంతో జిల్లా వాసులకు పరిశుభ్రతపై శ్రద్ధ పెరిగింది. ఎక్కడెక్కడో తిరిగి ఇంటికిరాగానే సోఫాలోనో, కూర్చీలోనో కూలబడే
ఇప్పుడిదే తారక మంత్రం
శానిటైజర్లు, సబ్బులకు డిమాండ్
నెలవారీ సరుకుల్లో తప్పనిసరి..
లిక్విడ్ హౌస్హోల్డ్ క్లీనింగ్ మార్కెట్ వృద్ధి
నెలవారీ బడ్జెట్లో దాదాపు రూ.3వేల అదనపు ఖర్చు
కరోనా.. ప్రజల జీవనశైలిని సమూలంగా మార్చేసింది. స్వచ్ఛతపై ప్రేమను పెంచింది. గతంలో నెలవారి బడ్జెట్లో సబ్బులు, పౌడర్లులాంటి వాటికే స్థానం ఉండేది. ఇప్పుడు హౌస్ క్లీనింగ్ లిక్విడ్స్తో పాటు కొత్తగా వెజిటబుల్ క్లీనింగ్ లిక్విడ్స్, నాన్వెజ్ క్లీనింగ్ లిక్విడ్స్ నిత్యావసరాల్లో భాగమయ్యాయి. శానిటైజర్లు, హ్యాండ్వాష్లు తప్పనిసరి అయ్యాయి. ఆ తర్వాత స్థానాన్ని యాంటిసెప్టిక్ లిక్విడ్స్, యాంటీ బ్యాక్టీరియల్ సోప్స్, వైప్స్ లాంటివి ఆక్రమిస్తున్నాయి.
గుంటూరు, జూన్ 29(ఆంధ్రజ్యోతి): కరోనా భయంతో జిల్లా వాసులకు పరిశుభ్రతపై శ్రద్ధ పెరిగింది. ఎక్కడెక్కడో తిరిగి ఇంటికిరాగానే సోఫాలోనో, కూర్చీలోనో కూలబడే అలవాటున్న వారు కూడా చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోకుండా ఇంట్లోకి అడుగుపెట్టడం లేదు. కనీసం హ్యాండ్ శానిటైజర్ను రాసుకోవడానికి అయినా ప్రయత్నిస్తున్నారు. క్లీనింగ్ ఉత్పత్తులతో పాటు, అంటువ్యాధులు ప్రబలకుండా హైజిన్ ఉత్పత్తులను వాడాల్సిన ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తిస్తుండంటంతో వీటి డిమాండ్ గణనీయంగా పెరిగిందని ఓ సూపర్ మార్కెట్ స్టోర్ మేనేజర్ అన్నారు.
సంప్రదాయపరంగా క్లీనింగ్ ప్రొడక్ట్స్ అంటే ఫినాయిల్, యాసిడ్ మాత్రమే...! యాసిడ్ వినియోగంపై ఇటీవల పెరుగుతున్న అనాసక్తి కారణంగా బ్రాండెడ్ లిక్విడ్ క్లీనర్లకు డిమాండ్ పెరిగింది. టాయ్లెట్ క్లీనర్లు, యుటెన్సిల్ క్లీనర్లు, సర్ఫేస్ క్లీనర్లు లాంటి వాటికి డిమాండ్ ఏర్పడింది. ఓ అంచనా ప్రకరారం ఈ క్లీనింగ్ లిక్విడ్ మార్కెట్ దాదాపు 20శాతానికి పెరుగుతుందని కరోనా రాకముందు అంచనా వేశారు. ఇప్పుడు ఈ మార్కెట్ 40శాతానికి పైగా వృద్ధి సాధిస్తోందని అంటున్నారు ఈ రంగంలోని నిపుణులు...! లిక్విడ్ హ్యాండ్వాష్ అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 42శాతం పెరిగాయని, హ్యాండ్శానిటైజర్ల అమ్మకాలు 200 శాతానికి పైగానే వృద్ధి చెందాయని పలు అద్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఖర్చూ పెరిగింది..
కరోనా విజృంభిస్తున్న నేపఽథ్యంలో వీలైనంతగా తమ జాగ్రత్తలో తాముండాలని అంతా కోరుకుంటున్నారు. ఈ క్రమంలో దాదాపు 65శాతం మందికి పైగా హ్యాండ్ శానిటైజర్లను తరుచూ వినియోగిస్తున్నారని మింటెల్ లాంటి అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కరోనా నగరవాసులు నెలవారీ బడ్జెట్పై అదపు భారం పడేలా చేసింది. సాధారణ మధ్యతరగతి ఇంట్లో గతంలో సర్ఫేస్, టాయ్లెట్ క్లీనింగ్కు నెలకు రూ.150 నుంచి రూ.200 ఖర్చు చేస్తే ఇప్పుడు ఖర్చు పెరిగింది. శానిటైజర్లు, హ్యాండ్వాష్, నాప్కిన్స్ లాంటివి కూడా కొనుగోలు చేస్తుండంటంతో నెలకు సుమారు రూ.400 నుంచి రూ.600 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని అంటున్నారు అమరావతి రోడ్డుకు చెందిన ఓ గృహిణి.
బయటి నుంచి తీసుకొచ్చిన ప్రతి ఒక్కటీ క్లీన్ చేసుకోవాలన్న డాక్టర్ల సూచనలతో కూరగాయలు, మాంసం, చేపలు లాంటివి శుభ్రం చేయడానికి ప్రత్యేక క్లీనర్స్ మార్కెట్లోకి వచ్చాయి. ల్యాప్టాప్స్, మొబైల్స్ లాంటి ఎలక్ర్టికల్ ఉపకరణాలు క్లీనింగ్కూ ప్రత్యేకమైన క్లీనర్లు వచ్చాయి. ఈ క్లీనర్స్తో కలిగే లాభం మాట అటుంచితే, ప్రజల భయం పలు కంపెనీలు వ్యాపారమార్గంగా మారింది. గతంలో నెలకు, రెండు నెలలకోమారు క్లీనర్ల స్టాక్ను ర్యాక్లలో నింపితే, ఇప్పుడు వారానికోసారి ఆ ర్యాక్లను ఫిల్ చేయాల్సి వస్తుందంటేనే డిమాండ్ ఏవిధంగా అర్ధమవుతుంది.