రాజధానిలో దారుణం.. మహిళను పొడిచి చంపిన గొలుసు దొంగ

ABN , First Publish Date - 2021-03-01T00:38:42+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు

రాజధానిలో దారుణం.. మహిళను పొడిచి చంపిన గొలుసు దొంగ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన దొంగ, ఆమె ప్రతిఘటించడంతో కత్తితో దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వాయవ్య ఢిల్లీలోని ఆదర్శనగర్‌లో జరిగిందీ ఘటన.  25 ఏళ్ల మహిళ తన రెండేళ్ల బిడ్డతో కలిసి నిన్న రాత్రి 9.30 గంటల సమయంలో మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తోంది. ఆమెను అనుసరిస్తూ వచ్చిన నిందితుడు ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కునే ప్రయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన ఆమె అతడిని గట్టిగా పట్టుకోవడంతో కిందపడ్డాడు. కిందపడిన అతడు వెంటనే కత్తితో మహిళపై దాడిచేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. 


బాధిత మహిళను సిమ్రన్ కౌర్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. తన సోదరిని చంపిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరినట్టు ఆమె సోదరుడు తెలిపాడు.

Updated Date - 2021-03-01T00:38:42+05:30 IST