మీరంతా వెళ్లిపోండి.. సారు కుక్కతో వాకింగ్కు వస్తున్నారు!
ABN , First Publish Date - 2022-05-27T07:06:16+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీలోని త్యాగరాజ్ ప్రభుత్వ స్టేడియం.. క్రీడాకారులు, ట్రైనర్లకు అనువైన మైదానం.
ఐఏఎస్ అధికారి కోసం స్టేడియం ఖాళీ
క్రీడాకారులు, శిక్షకులకు తీవ్ర అసౌకర్యం
న్యూఢిల్లీ, మే 26: దేశ రాజధాని ఢిల్లీలోని త్యాగరాజ్ ప్రభుత్వ స్టేడియం.. క్రీడాకారులు, ట్రైనర్లకు అనువైన మైదానం. సాయంత్రం శిక్షణ తీసుకుంటు న్న క్రీడాకారులను నిర్దేశిత సమయం కంటే ముందే వెళ్లిపోవాలని నిర్వాహకులు చెబుతున్నారు. ఎందుకని అడిగితే.. ‘సారు కుక్కతో కలిసి వాకింగ్కు వస్తారు’ అంటున్నారు. గత కొన్ని నెలలుగా ఆయన తన పెంపుడు కుక్కతో వాకింగ్కు వెళ్తుండడంతో స్టేడియం మొత్తం ఖాళీ చేయిస్తున్నారు. ఐఏఎస్ నిర్వాకంతో క్రీడాకారుల కు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. స్టేడియం సాధారణంగా రాత్రి 7 గంటల వరకు క్రీడాకారులు, శిక్షకులతో బిజీగా ఉంటుంది. అయితే, ఢిల్లీ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సంజీవ్ ఖిర్వార్ ఈ స్టేడియాన్ని తన పెంపు డు కుక్కతో వాకింగ్ చేసేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఇందుకోసం నిర్ణీత సమయం కంటే ముందే క్రీడాకారులను, శిక్షకులను స్టేడియం నుంచి బయటకు పంపిస్తున్నారు. 7.30 గంటల సమయంలో ఖిర్వార్ తన భార్య, తన పెంపుడు కుక్కతో అక్కడకు చేరుకొని వాకింగ్ చేస్తున్నారు. కుక్కను ట్రాక్పై వదిలేస్తున్నారు. కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ తంతుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రాత్రి 8.30 గంటల వరకు సాధన చేసేవాళ్లమని.. ఐఏఎస్ అధికారి తీరుతో తమకు ఆటం కం కలుగుతోందని క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఈ వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడం తో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. రాత్రి 10 గంటల వరకు నగరంలోని స్టేడియాలన్నీ క్రీడాకారులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించినట్లు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వెల్లడించారు. ఇది అధికార దుర్వినియోగమేనని, ఐఏఎస్ అధికారి క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ డిమాండ్ చేశారు. కాగా, ఈ వ్యవహారంపై ఖిర్వార్ స్పందిస్తూ.. తనతోపాటు పెంపు డు శునకాన్ని అప్పుడప్పుడు వాకింగ్కు తీసుకెళ్లిన మాట వాస్తవమేనన్నారు. అయితే, అది క్రీడాకారులు, శిక్షకులకు ఇబ్బంది కలిగించలేదని చెప్పారు.
ఐఏఎస్ బదిలీ
తీవ్రంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల జంట ఖిర్వార్ను లడ్డాఖ్కు, ఆయన భార్య అను దుగ్గాను అరుణాచల్ ప్రదేశ్కు బదిలీ చేసింది.