ISIS : ఢిల్లీ విద్యార్థికి ఐఎస్ఐఎస్‌తో లింకులు?.. అరెస్ట్ చేసిన ఎన్ఐఏ..

ABN , First Publish Date - 2022-08-07T23:27:12+05:30 IST

ఉగ్రవాదుల కోసం నిధుల సేకరిస్తున్నాడనే కారణంగా ఢిల్లీలో ఇంజనీరింగ్ చదువుతున్న మోసిన్ అహ్మద్ అనే యువకుడిని ఎన్ఐఏ శనివారం అరెస్ట్ చేసింది.

ISIS : ఢిల్లీ విద్యార్థికి ఐఎస్ఐఎస్‌తో లింకులు?.. అరెస్ట్ చేసిన ఎన్ఐఏ..

న్యూఢిల్లీ:  గ్లోబల్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ISIS) కోసం నిధుల సేకరిస్తున్నాడనే కారణంగా ఢిల్లీ(Delhi)లో ఇంజనీరింగ్ చదువుతున్న మోసిన్ అహ్మద్ (Mohsin Ahmad) అనే బిహార్ యువకుడిని ఎన్ఐఏ(NIA) శనివారం అరెస్ట్ చేసింది. నగరంలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో మోసిన్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడని తెలిపింది. ఐఎస్ఐఎస్‌తో ఆన్‌లైన్‌ వేదికగా  సంబంధాలు కొనసాగిస్తున్నాడని, ఉగ్రవాదం పట్ల ప్రేరేపితమై నిధులు సేకరిస్తున్నాడని ఎన్ఐఏ ప్రతినిధి ఒకరు  వెల్లడించారు. వేర్వేరు దేశాల నుంచి క్రిప్టో కరెన్సీ రూపంలో నిధులను సిరియాకి చేరవేస్తున్నాడని ఎన్ఐఏ వివరించింది. అయితే ఈ ఆరోపణలను మోసిన్ కుటుంబం తోసిపుచ్చింది. కోర్టులో సవాలు చేయబోతున్నట్టు తెలిపింది. ఈ మేరకు మోసిన్ కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయమే పాట్నా నుంచి ఢిల్లీ చేరుకున్నారు. మోసిన్‌కి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తండ్రి ఇండియన్ రైల్వేస్‌లో పనిచేస్తున్నాడు. 


‘ మోసిన్ నిధులు సేకరించి ఉంటే అతడి వద్ద చాలా డబ్బు ఉండాలి కదా. కానీ ఓ కోడింగ్ కోర్స్ నేర్చుకోవడానికి రూ.4 వేలు కావాలంటూ మొన్నే మెసేజీ పంపించాడు’ అని మోసిన్ సోదరి ఒకరు చెప్పారు. మోసిన్ పరోపకారి అని, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టేవాడని తెలిపింది. కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో నిధులు సేకరించి పేదలకు సహాయ కార్యక్రమాలు నిర్వహించాడని వెల్లడించింది. రెండుసార్లు పరీక్ష రాసి ఇంజనీరింగ్ ఎంట్రెన్స్‌లో అర్హత సాధించాడని వివరించింది. నా సోదరుడు చాలా అమాయకుడని పేర్కొంది. కాగా మోసిన్ జులై 12నే ఢిల్లీ వెళ్లాడని అతడి తల్లి చెప్పింది. స్నేహితులతో కలిసి నివసిస్తున్నాడని పేర్కొంది. 


కాగా ఢిల్లీలోని బత్లా ఏరియాలో నివాసముంటున్న మోసిన్‌ను ఎన్ఐఏ శనివారం అరెస్ట్ చేసింది. ఐఎస్ఐఎస్‌తో ఆన్‌లైన్‌లో సంబంధాలు నడుపుతున్నాడని, జూన్ 25న క్షేత్రస్థాయి కార్యకలాపాలకు కూడా పాల్పడ్డాడని పేర్కొంది. మోసిన్ అహ్మద్‌ను ఐఎస్ఐఎస్ క్రియాశీల సభ్యుడిగా ఉన్నాడని, సానుభూతిపరుల నుంచి ఇటు భారత్‌తోపాటు విదేశాల నుంచి నిధులు సేకరించాడని పేర్కొంది.

Updated Date - 2022-08-07T23:27:12+05:30 IST