ఢిల్లీ అల్లర్ల వెనుక జాకీర్ నాయక్ ప్రమేయం

ABN , First Publish Date - 2020-07-04T14:45:45+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో జరిగిన అల్లర్ల వెనుక మత బోధకుడు జాకీర్ నాయక్ ప్రమేయం ఉందని స్పెషల్....

ఢిల్లీ అల్లర్ల వెనుక జాకీర్ నాయక్ ప్రమేయం

పోలీసుల దర్యాప్తులో వెల్లడి

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో జరిగిన అల్లర్ల వెనుక మత బోధకుడు జాకీర్ నాయక్ ప్రమేయం ఉందని స్పెషల్ సెల్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఫిబ్రవరి 24వతేదీన ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ చట్ట మద్ధతుదారులు, నిరసనకారులకు మధ్య హింస చెలరేగి మత ఘర్షణలు చెలరేగాయి. ఈ అల్లర్ల కేసులో అరెస్టు అయిన ఖలీద్ సైఫీ గతంలో మలేషియా దేశంలో ఇస్లాం మత బోధకుడు జాకీర్ నాయక్ ను కలిసినట్లు ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం దర్యాప్తులో వెల్లడైంది. ఖలీద్ సైఫ్ కు అల్లర్లకు కారణమైన ఉమర్ ఖలీద్, తాహిర్ హుసేన్ లకు సంబంధాలున్నాయని పోలీసులు చెప్పారు.సౌదీఅరేబియాతోపాటు సింగపూర్ కు చెందిన ఓ ఎన్నారై నుంచి నిధులు వచ్చాయని తేలింది.


ఘజియాబాద్ కాంగ్రెస్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఇష్రత్ జహాన్ కు మహారాష్ట్రలోని బంధువుల ద్వారా రహస్యంగా నిధులు వచ్చాయని తేలడంతో ఆమెను ఢిల్లీ  పోలీసులు మార్చి నెలలో అరెస్టు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఖలీద్ సైఫీ, ఇష్రత్ జహాన్ ల విచారణ పెండింగులో ఉంది. ఖలీద్ సైఫీకి సింగపూర్ నుంచి వచ్చిన ఎన్నారై ఖాతా ద్వారా అల్లర్లకు నిధులు వచ్చాయని దర్యాప్తులో తేలింది. ఈ డబ్బును నిర్బంధంలో ఉన్న ఉమర్ ఖలీద్, అతని మీరట్ ఆధారిత భాగస్వామి నడుపుతున్న ఒక స్వచ్ఛంద సంస్థకు బదిలీ చేశారు. సింగపూర్ ఎన్నారైని గుర్తించడానికి పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.ఖలీద్ సైఫీ మొబైల్ ఫోన్ నుంచి డబ్బు బదిలీల గురించి మరిన్ని వివరాలు సేకరించాలని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు.

Updated Date - 2020-07-04T14:45:45+05:30 IST