ఆన్లైన్ డెలివరీ ఏజెంట్లకు పోలీసుల ప్రత్యేక పాసులు
ABN , First Publish Date - 2020-03-26T15:21:39+05:30 IST
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు నిత్యావసరాల కొరత రాకుండా ఈ-కామర్స్ కంపెనీలకు చెందిన డెలివరీ ఏజెంట్లకు కర్ఫ్యూ పాసులు...
న్యూఢిల్లీ: లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు నిత్యావసరాల కొరత రాకుండా ఈ-కామర్స్ కంపెనీలకు చెందిన డెలివరీ ఏజెంట్లకు కర్ఫ్యూ పాసులు జారీ చేయాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు. ఈ-కామర్స్ వెబ్సైట్లకు చెందిన వేర్హౌస్లకు మార్కెట్ల నుంచి సరుకులు తరలిస్తున్న సిబ్బందిని పోలీసులు కొడుతున్నారంటూ ఇటీవల పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆయా సంస్థలకు చెందిన ప్రతినిధులతో ఢిల్లీ పోలీసులు నిన్న సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. అనంతరం ఢిల్లీ పోలీస్ పీఆర్వో మన్దీప్ సింగ్ రంధావా మాట్లాడుతూ... ‘‘ఈ-కామర్స్ వెబ్సైట్లకు ఎదురయ్యే సమస్యలను మాతో పంచుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. వారి సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తాం. నిత్యావసర సరుకుల రవాణాకు ఆటంకాలు రాకుండా డెలివరీ ఏజెంట్లకు ప్రత్యేకంగా పాసులు జారీ చేస్తాం...’’ అని వెల్లడించారు.