ఐదు రూపాయల ప్రమోషన్‌పై 23 ఏళ్ల పోరాటం... ఎట్టకేలకు...

ABN , First Publish Date - 2021-03-06T16:20:36+05:30 IST

1995వ సంవత్సరంలో జరిగిన తందూర్ హత్య కేసులో...

ఐదు రూపాయల ప్రమోషన్‌పై 23 ఏళ్ల పోరాటం... ఎట్టకేలకు...

న్యూఢిల్లీ: 1995వ సంవత్సరంలో జరిగిన తందూర్ హత్య కేసులో ముందుగా సంఘటనా స్థలానికి వెళ్లిన ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్లా నజీర్ కుంజూకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. 23 ఏళ్ల తరువాత కుంజూ తన విభాగంపై వేసిన కేసులో విజయం సాధించారు. తందూర్ హత్య కేసులో ప్రధాన సాక్షిగా నిలిచినందుకు, కేసులో చాకచక్యంగా వ్యవహరించినందుకు కుంజూకు ప్రమోషన్ లభించింది. 


అయితే శాలరీ కేవలం ఐదు రూపాయలు మాత్రమే పెరిగింది. దీంతో కుంజూ తాను పనిచేస్తున్న విభాగంపై కేసు వేశారు. దీంతో సుప్రీం కోర్టు ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తూ... రెండు నెలల వ్యవధిలోగా కుంజూకు అందాల్సిన లబ్ధిని అందజేయాలని తెలిపింది. ఈ కేసులో కుంజూ చెప్పిన సాక్ష్యం ఎంతో కీలకంగా మారింది. ఢిల్లీ యువ కాంగ్రెస్ అధ్యక్షుడు సుశీల్ శర్మ తన భార్య నైనా సహానీని హత్య చేసి, మృతదేహాన్ని ఒక రెస్టారెంట్‌లోని తందూర్‌లో కాల్చివేశాడు. ఈ కేసులో సునీల్ శర్మను కోర్టు దోషిగా ప్రకటించింది. ఈ సందర్భంగా కుంజూ మీడియాతో మాట్లాడుతూ తాను తన విభాగం తీరు విషయంలో నిరాశచెంది, సుప్రీం కోర్టును ఆశ్రయించి విజయం సాధించానన్నారు. 1995లో తందూర్ హత్య కేసులో తన చొరవ చూసి, ప్రమోషన్ ఇచ్చారని, అయితే ఇంక్రిమెంట్ కేవలం ఐదు రూపాయలే పెంచారని తెలిపారు. ఐదవ వేతన సంఘం సిఫార్సులు అమలైన తరువాత కూడా తన వేతనం జూనియర్ల కన్నా తక్కువగా ఉందని వాపోయారు. ఈ విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఈ నేపధ్యంలోనే తాను చివరిగా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో న్యాయం లభించిందని తెలిపారు.

Updated Date - 2021-03-06T16:20:36+05:30 IST