డీఆర్డీఓ శాస్త్రవేత్త అరెస్ట్
ABN , First Publish Date - 2021-12-18T20:01:33+05:30 IST
దేశ రాజధాని నగరం ఢిల్లీలోని రోహిణి జిల్లా కోర్టులో
న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలోని రోహిణి జిల్లా కోర్టులో ఇటీవల జరిగిన బాంబు పేలుడు కేసులో డీఆర్డీఓ (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ)కు చెందిన ఓ శాస్త్రవేత్తను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఓ న్యాయవాదిని హత్య చేయాలనే లక్ష్యంతో ఈ శాస్త్రవేత్త ఓ టిఫిన్ బాక్స్ బాంబును అమర్చినట్లు ఆరోపించారు.
రోహిణి జిల్లా కోర్టులో డిసెంబరు 9న తక్కువ తీవ్రతగల బాంబు పేలిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో ఓ పోలీసు కానిస్టేబుల్ గాయపడ్డారు. ఢిల్లీ పోలీసులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం, నిందితునికి ఓ న్యాయవాదితో వివాదం ఉంది. దీంతో ఆ న్యాయవాదిని హత్య చేయాలని నిందితుడు ప్రయత్నించారు. తానే స్వయంగా బాంబును తయారు చేసి, ఈ కోర్టులోని 102వ గదిలో ఉంచారు. ఈ విషయాన్ని దర్యాప్తులో నిందితుడు అంగీకరించారు.
అనేక రకాల ఆధారాలను సేకరించి, నిర్థరణ చేసుకున్న తర్వాత నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. శాస్త్రవేత్త, న్యాయవాది ఇరుగుపొరుగువారేనని తెలిపారు. వీరు ఉంటున్న అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఏర్పాటు విషయంలో వీరిద్దరికీ ఘర్షణ జరిగిందని, వివాదం కోర్టు విచారణలో ఉందని తెలిపారు. ఈ సంఘటనలో ఉగ్రవాద కోణం లేదన్నారు.