ఢిల్లీలో రైతులపై లాఠీచార్జీకి నిరసన వెల్లువ
ABN , First Publish Date - 2020-11-29T06:30:34+05:30 IST
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు బిల్లులను వ్యతిరేకిస్తూ రైతు సంఘాల పిలుపుతో ఢిల్లీ జంతర్మంతర్కు వెళుతున్న రైతు నాయకులు, రైతులపై హర్యానా ప్రభుత్వం లాఠీచార్జీ చేయటాన్ని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో చల్లపల్లిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
చల్లపల్లి, నవంబరు 28 : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు బిల్లులను వ్యతిరేకిస్తూ రైతు సంఘాల పిలుపుతో ఢిల్లీ జంతర్మంతర్కు వెళుతున్న రైతు నాయకులు, రైతులపై హర్యానా ప్రభుత్వం లాఠీచార్జీ చేయటాన్ని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో చల్లపల్లిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. శనివారం బస్టాండ్ సెంటర్లో సీఐటీయూ నేతలు, కార్యకర్తలు, కార్మికులు నిరసన తెలిపి, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐటీయూ దివి డివిజన్ కార్యదర్శి శీలం నారాయణ రావు, మండల కార్యదర్శి అన్నం గగారిన్, పి.వి.సాంబశివరావు పాల్గొన్నారు. మోపిదేవి : కేంద్ర ప్రభుత్వం రైతులపై లాఠీచార్జి చేయటం దుర్మార్గమని తూర్పు కృష్ణా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శీలం నారాయణరావు అన్నారు. సీఐటీయూ మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు మద్దాల వెంకటేశ్వరరావు, సీహెచ్ రాజశేఖర్, సీపీఎం మండల కార్యదర్శి బండి ఆదిశేషు ఉన్నారు. గుడివాడటౌన్ : ఢిల్లీలో రైతుల నిరసన ప్రదర్శనను ప్రభుత్వం అడ్డుకుని, రైతులపై భాష్పవాయు ప్రయోగం, లారీచార్జీ చేయడాన్ని ఖండిస్తూ నెహ్రుచౌక్ సెంటర్లో శనివారం రైతు సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రైతు సంఘం డివిజన్ కార్యదర్శి నీలం మురళీకృష్ణారెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పిల్లి మహేష్, పి.రజని, ఆర్.కొండ, బి.శ్రీను, కె.చలపతిరావు, శొంఠి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.