Delhi High Court : ఢిల్లీకి ఆక్సిజన్ ఈరోజే ఇచ్చి తీరాలి

ABN , First Publish Date - 2021-05-01T21:58:59+05:30 IST

దేశ రాజధాని నగరం ఢిల్లీకి 490 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను

Delhi High Court : ఢిల్లీకి ఆక్సిజన్ ఈరోజే ఇచ్చి తీరాలి

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీకి 490 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను శనివారమే ఇచ్చి తీరాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ఆధారంగా హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఓ ఆసుపత్రిలో ఎనిమిది మంది ఆక్సిజన్ లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని తెలిపింది. శనివారం నిర్వహించిన ప్రత్యేక విచారణలో జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ రేఖ పల్లి డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలిచ్చింది. 


కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఢిల్లీకి 490 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనిని కేంద్ర ప్రభుత్వం కేటాయించినప్పటికీ, సరఫరా చేయడం లేదని తెలిపింది. శుక్రవారం రాత్రి ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు వెల్లడించింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఆక్సిజన్ సరఫరా కాలేదని తెలిపింది. పరిస్థితి దయనీయంగా ఉందని వివరించింది. 


బాత్రా ఆసుపత్రి దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు శనివారం ప్రత్యేక విచారణ జరిపింది. ఆక్సిజన్ లేకపోవడం వల్ల  ఓ డాక్టర్ సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని బాత్రా ఆసుపత్రి హైకోర్టుకు తెలిపింది. దీంతో హైకోర్టు ఘాటుగా స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ శనివారమే 490 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఢిల్లీకి సరఫరా చేయాలని, లేనిపక్షంలో కోర్టు ధిక్కార చర్యలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఢిల్లీ రాష్ట్రం కోసం ఉద్దేశించిన నాలుగు ఆక్సిజన్ ట్యాంకర్లను రాజస్థాన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, వీటిని విడిపించి, ఢిల్లీ రాష్ట్రానికి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది. 


ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీలోని ఆసుపత్రుల్లో చేరిన రోగుల సంఖ్య, విడుదలైనవారి సంఖ్య, చికిత్స పొందుతున్నవారి సంఖ్యలను మంగళవారంనాటికి తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆసుపత్రుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, పడకలను ఖాళీ చేయడం లేదని వస్తున్న ఆరోపణలపై సమీక్షించేందుకు ఈ సమాచారాన్ని సమర్పించాలని కోరింది. 


ఆసుపత్రులు తమ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, ఆక్సిజన్ ప్లాంట్లను సొంతంగా ఏర్పాటు చేసుకోవాలని హైకోర్టు తెలిపింది. వీటిని ఏర్పాటు చేసుకోకపోవడం బాధ్యతారాహిత్యమేనని పేర్కొంది.


Updated Date - 2021-05-01T21:58:59+05:30 IST