మద్యపానానికి అర్హత వయసు తగ్గింపుపై కేజ్రీవాల్ ప్రభుత్వానికి నోటీసు

ABN , First Publish Date - 2021-07-29T00:03:01+05:30 IST

మద్యాన్ని వినియోగించేందుకు అర్హత వయసును 25 ఏళ్ళ నుంచి

మద్యపానానికి అర్హత వయసు తగ్గింపుపై కేజ్రీవాల్ ప్రభుత్వానికి నోటీసు

న్యూఢిల్లీ : మద్యాన్ని వినియోగించేందుకు అర్హత వయసును 25 ఏళ్ళ నుంచి 21 సంవత్సరాలకు తగ్గించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం ఈ నోటీసు ఇచ్చింది. తదుపరి విచారణ సెప్టెంబరు 17న జరుగుతుందని తెలిపింది. 


ఆలిండియా భ్రష్టాచార్ విరోధి మోర్చా అనే సంస్థ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఎక్సయిజ్ విధానంలో మద్యపానానికి అర్హత వయసును  25 ఏళ్ళ నుంచి 21 సంవత్సరాలకు తగ్గించారని, దీనివల్ల విద్యార్థులు, యువ తరం ఎక్కువగా మద్యపానానికి అలవాటు పడతారని, ఫలితంగా సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపింది. మత్తు కలిగించే పానీయాల వినియోగంపై నిషేధం విధించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించాలని రాజ్యాంగంలోని అధికరణ 47 చెప్తోందని పేర్కొంది. ఔషధ సంబంధిత అవసరాల కోసం మినహా ఇతర విధాలుగా మద్యపానాన్ని నిషేధించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని తెలిపింది. 


ప్రస్తుతం మద్యపానానికి అర్హత వయసు హర్యానాలో 25 ఏళ్లు, ఉత్తర ప్రదేశ్‌లో 21 సంవత్సరాలు. ఉత్తర ప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకుని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఈ వయో పరిమితిని తగ్గించిందని పిటిషనర్ ఆరోపించారు. 


Updated Date - 2021-07-29T00:03:01+05:30 IST