Visa scam: కార్తీ చిదంబరానికి Anticipatory bail నిరాకరణ
ABN , First Publish Date - 2022-06-03T23:14:42+05:30 IST
చైనీస్ వీసా స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరానికి సీబీఐ ప్రత్యేక కోర్టులో...
న్యూఢిల్లీ: చైనీస్ వీసా స్కామ్ (Chinese Visas scam)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరానికి (Karti Chidambaram) చుక్కెదురైంది. ఈడీ నమోదు చేసిన ఈ కేసులో కార్తీ చిదంబరానికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారంనాడు నిరాకరించింది. కార్తీ దరఖాస్తును పరిశీలించేందుకు తగిన కారణాలు లేవని ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ పేర్కొంటూ ముందస్తు బెయిల్కు నిరాకరించారు.
కార్తీ తండ్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం 2011లో కేంద్ర హోం మంత్రిగా ఉన్నప్పుడు 263 మంది చైనా పౌరులకు వీసాలు మంజూరు చేసిన కేసులో కార్తీ చిదంబరంతో పాటు పలువురిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటీవల మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో సీబీఐ ఇటీవల ఇచ్చిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టును పరిగణనలోకి తీసుకొని మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. ఈ కేసుపై తీర్పును మే 30న ప్రత్యేక కోర్టు రిజర్వ్ చేసింది.