ఎవరూ చట్టానికి అతీతులు కాదు.. సింగర్ హనీసింగ్‌కు చుక్కెదురు

ABN , First Publish Date - 2021-08-28T23:31:56+05:30 IST

గాయకుడు హర్దేశ్ సింగ్ (హనీ సింగ్)కు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. ఆయన భార్య షాలిని తల్వార్ వేసిన గృహ హింస కేసులో..

ఎవరూ చట్టానికి అతీతులు కాదు.. సింగర్ హనీసింగ్‌కు చుక్కెదురు

న్యూఢిల్లీ: గాయకుడు హర్దేశ్ సింగ్ (హనీ సింగ్)కు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. ఆయన భార్య షాలిని తల్వార్ వేసిన గృహ హింస కేసులో సెప్టెంబర్ 3న కోర్టు ముందు హాజరుకావాలని మెట్రోపాటిటన్ మెజిస్ట్రేట్ తనియా సింగ్ శనివారంనాడు ఆదేశాలు ఇచ్చారు. తన ఆరోగ్యం బాగోలేదంటూ హనీసింగ్ కోర్టుకు గైర్హాజరైన నేపథ్యంలో మెజిస్ట్రేట్ తాజా ఆదేశాలిచ్చారు. చట్టానికి ఎవరూ అతీతం కాదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.


తన క్లయింట్‌కు ఆరోగ్యం బాలేనందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని, తదుపరి విచారణ తేదీకి ఆయన హాజరై మెడికల్ రికార్డులు, ఆదాయం డాక్యుమెంట్లు సమర్పిస్తారని హనీసింగ్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. షాలిని తల్వార్ తరఫున అడ్వకేట్ సందీప్ కపూర్, కరంజావాలా అండ్ కో నుంచి అపూర్వ పాండే, జీజీ కశ్యప్ హాజరయ్యారు. 2011లో వివాహమైన తర్వాత షాలిని తల్వార్‌పై హనీసింగ్ చాలా దురహంకారంగా, దురుసుగా, ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరించేవాడని పేర్కొంటూ గృహహింసా చట్టం కింద వీరు కేసు వేశారు. కాగా, కేసు విచారణ సందర్భంగా షాలిని తల్వార్ కంటతడి పెట్టారు. పదేళ్లకు పైగా తన భర్తకు సమయం ఇచ్చానని, ఆయనకు అండగా నిలిచానని, కానీ తనను ఏమాత్రం ఖాతరు చేయకపోవడంతో తనకు కోర్టును ఆశ్రయించడం మినహా మరోమార్గం లేకపోయిందని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు ఆమె వాపోయింది.

Updated Date - 2021-08-28T23:31:56+05:30 IST