ఢిల్లీ సరిహద్దులు మూసేయడం తప్పు: బీజేపీ

ABN , First Publish Date - 2020-06-03T19:59:51+05:30 IST

దేశ రాజధానిలోని ఆసుపత్రుల్లో నిర్వహణా లోపాలు, కరోనా వైరస్ పేషెంట్ల సంఖ్య పెరగడానికి ఢిల్లీ ప్రభుత్వ నిర్వాకమే కారణమని..

ఢిల్లీ సరిహద్దులు మూసేయడం తప్పు: బీజేపీ

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఆసుపత్రుల్లో నిర్వహణా లోపాలు, కరోనా వైరస్ పేషెంట్ల సంఖ్య పెరగడానికి ఢిల్లీ ప్రభుత్వ నిర్వాకమే కారణమని బీజేపీ రాష్ట్ర విభాగం కొత్త అధ్యక్షుడు ఆదేష్ కుమార్ గుప్తా తప్పుపట్టారు. బుధవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, సరిహద్దు రాష్ట్రాలతో ఢిల్లీ సరిహద్దులను మూసివేయడం తప్పుడు నిర్ణయమని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు తీసుకున్న నిర్ణయమని అన్నారు. కరోనా సమయంలో ప్రైవేటు ఆసుపత్రులు ప్రజలను లూటీ చేస్తున్నా ఢిల్లీ ప్రభుత్వం మిన్నకుందని ఆరోపించారు.


'రేషన్ పంపిణీ, ఆసుపత్రుల నిర్వహణలో ఢిల్లీ సర్కార్ విఫలమైంది. ప్రజలు భయాందోళనల్లో ఉన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు ప్రజలను దోచుకుంటున్నాయి. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు' అని గుప్తా అన్నారు. కోవిడ్ కేసులు 22,000 దాటడం, మృతుల సంఖ్య 500కు చేరుకోవడంపై ఆయన మాట్లాడుతూ, పేషెంట్లు, మరణాల విషయంలో ప్రభుత్వం తప్పుడు గణాంకాలు సమర్పిస్తోందన్నారు.


'కోవిడ్ 19 పరిస్థితిపై తప్పుడు డాటా సమర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరచలేదు. ఒక యాప్‌ను విడుదల చేసి అందులో కేవలం ఏడు ఆసుపత్రులు, పడకల వివరాలు మాత్రమే ఇచ్చారు. మేము సొంతంగా విచారణ చేశాం. పడకలు లేనందున పేషెంట్లను అడ్మిట్ చేసుకోవడం లేదని నాలుగు ఆసుపత్రులు సమాచారం ఇచ్చాయి' అని గుప్తా చెప్పారు.

Updated Date - 2020-06-03T19:59:51+05:30 IST