మిశ్రా మాయ.. ముంబైపై ఢిల్లీ గెలుపు!

ABN , First Publish Date - 2021-04-21T05:17:05+05:30 IST

భారత యువ సంచలనం రిషభ్ పంత్‌ కెప్టెన్సీ వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో సోమవారం నాడు జరిగిన మ్యాచులో ఢిల్లీ జట్టును విజయం వరించింది.

మిశ్రా మాయ.. ముంబైపై ఢిల్లీ గెలుపు!

చెన్నై: భారత యువ సంచలనం రిషభ్ పంత్‌ కెప్టెన్సీ వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో సోమవారం నాడు జరిగిన మ్యాచులో ఢిల్లీ జట్టును విజయం వరించింది. చెన్నైలోని ఎమ్ఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో ముంబై జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ జట్టును సీనియర్ ఆఫ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా వణికించాడు. కెప్టెన్ రోహిత్(44) సహా హార్దిక్ పాండ్యా(0), కీరన్ పొలార్డ్(2), ఇషాన్ కిషన్(26) వికెట్లు ఈ సీనియర్ స్పిన్నర్ ఖాతాలో వేసుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ముంబై జట్టు 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది.


లక్ష్య ఛేదనలో ఢిల్లీ జట్టు ఆరంభంలోనే పృథ్వీ షా(7) వికెట్ కోల్పోయింది. అయితే శిఖర్ ధవన్(45)తో కలిసి స్టీవ్ స్మిత్(33) జట్టును విజయ పథంలో నడిపించాడు. ఆ తర్వాత లలిత్ యాదవ్(22 నాటౌట్), రిషభ్ పంత్(7), హెట్మెయర్(14 నాటౌట్) కలిసి మిగతా లాంఛనాన్ని పూర్తిచేశారు. చివరి ఓవర్లో 5 పరుగులు కావలసి ఉండగా.. తొలి బంతికే హెట్మెయర్ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాతి బంతి నోబాల్ కావడంతో మరో 5 బంతులుండగానే ఢిల్లీ జట్టు విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకూ 4 మ్యాచులు ఆడిన ఢిల్లీకి ఇది మూడో విజయం. ముంబై బౌలర్లలో జయంత్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రాహుల్ చాహర్, కీరన్ పొలార్డ్ తలా ఒక వికెట్ కూల్చారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా అమిత్ మిశ్రా నిలిచాడు. 

Updated Date - 2021-04-21T05:17:05+05:30 IST